తమ అభిమాన హీరోను ఒక్క మాటంటే చాలు వారికి ‘పాడి’ కట్టేయడం పవన్ ఫ్యాన్స్ కు పరిపాటిగా మారిపోయింది. గతంలో పవన్ కళ్యాణ్ ను, ఆయన అభిమానులను సోషల్ మీడియా వేదికగా ఆడుకున్న రాంగోపాల్ వర్మ చనిపోయారంటూ ట్విట్టర్ లో పవన్ ఫ్యాన్స్ చేసిన హంగామా తెలియనిది కాదు. అయితే వారి కంటే ఓ ‘వందాకులు’ ఎక్కువ చదివిన వర్మ ముందు వారి ఆటలు సాగలేదు.
అప్పుడు వర్మను ఎలా అయితే టార్గెట్ చేసారో ప్రస్తుతం మహేష్ కత్తిని కూడా అదే రీతిలో టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మహేష్ కత్తి చనిపోయారంటూ పోస్టర్లు సృష్టించి ట్విట్టర్, ఫేస్ బుక్, వాట్సప్ లలో పవన్ అభిమానులు సర్క్యూలేట్ చేస్తున్నారు. జవాబు చెప్పలేని పరిస్థితులలోనే ఇలాంటి ఎదురుదాడికి పవన్ ఫ్యాన్స్ దిగుతున్నారన్న విషయం అవగతం అవుతోంది.
ఇప్పటివరకు మహేష్ కత్తి మాదిరి ఎవరూ ప్రశ్నించకపోవడంతో, లేచిన ఆ ఒక్క స్వరాన్ని కూడా అణగద్రొక్కాలనే ప్రయత్నంలో పవన్ ఫ్యాన్స్ పూనుకున్నట్లుగా కనపడుతోంది. అయితే ఇలాంటి చేష్టలను పవన్ కళ్యాణ్ కూడా అడ్డగించకుండా మౌనం వహించడమంటే, వాటిని పరోక్షంగా సమర్ధించడమే కదా! బహిరంగ వేదికలపై ఎన్నో నీతిసూత్రాలు చెప్పే పవన్, తన అభిమానులకు మాత్రం ఒక్క నీతి వ్యాఖ్యం కూడా చెప్పలేకపోవడం శోచనీయం.