గత కొన్ని రోజులుగా ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ పై మరియు ఆయన అభిమానులపై ‘దండయాత్ర’ చేస్తోన్న మహేష్ కత్తి, తన దూకుడును అలాగే కొనసాగిస్తున్నారు. పవర్ స్టార్ చేసిన చిన్న పొరపాటును కూడా వదిలేది లేదని మహేష్ కత్తి మరోసారి చెప్పకనే చెప్పారు. ఈ సారి ఏకంగా పవన్ కళ్యాణ్ కు ‘సెన్స్’ లేదంటూ చేసిన కామెంట్స్ మహేష్ కత్తిని మరోసారి మీడియా వర్గాలలో హైలైట్ అయ్యేలా చేసింది.
సీనియర్ జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ రెండు రోజుల క్రితం హత్యకు గురైన నేపథ్యంలో… గురువారం రాత్రి పవన్ కళ్యాణ్ ఈ అంశంపై ట్వీట్లు చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్లలో… గౌరీ లంకేశ్ పేరును గౌరీ శంకర్ గా పేర్కొంటూ రాసుకొచ్చారు. దీన్ని గుర్తించిన మహేశ్ కత్తి… హత్యకు గురైన జర్నలిస్ట్ పేరు గౌరీ శంకర్ కాదు గౌరీ లంకేశ్ అంటూ పవన్ ని ఎద్దేవా చేశాడు. అంతేకాదు ఇందుకు గానూ పవన్ ను ఏకిపారేసారు.
మోడీ, హిందుత్వ విధానాలకు మద్దతు తెలిపిన పవన్ ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నాడని, ఈ హత్య కేసులో నిజానిజాలు తేలేవరకు తాను ఈ హత్యపై ఎవరిపై ఎటువంటి విమర్శలు చేయబోనని పవన్ అంటున్నారని మహేశ్ కత్తి పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కులాలకు, మతాలకు అతీతమైన వ్యక్తని, అలాగే జ్ఞానం లేని వ్యక్తని తనకు ఇప్పుడు అర్థమైందని తీవ్రంగా స్పందించారు. దీంతో యధావిధిగా మళ్ళీ పవన్ ఫ్యాన్స్ నుండి ప్రతిస్పందన ఎదుర్కొంటున్నారు.