గతంలో తనను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు బెదిరించినప్పుడు మీడియా ముందుకు వచ్చి ప్రజలు స్పందించాలని కోరానని, అయితే ఎప్పుడూ తాను సేఫ్ జోన్లోనే ఉండాలని కోరుకునే పవన్ కళ్యాణ్ అస్సలు స్పందించలేదని విమర్శించారు. దాన్ని బట్టి తనకు పవన్ కళ్యాణ్ మనస్తత్వం మరింత అర్థమైందని అన్నారు.
‘జబర్దస్త్’ కామెడీ షోలో మనుషుల రంగు, రూపం గురించి జోక్లు వేస్తూ హేళన చేస్తున్నారంటూ హైపర్ ఆదిపై మహేశ్ కత్తి మండిపడ్డ విషయం తెలిసిందే. ఈ అంశంపై చర్చించడానికి ప్రముఖ న్యూస్ ఛానెల్ స్టూడియోకి వచ్చిన సందర్భంలో… జబర్దస్త్ షోపై విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ అంశంపై కూడా మరోసారి స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు.
తన అభిమానులు చేస్తోన్న వికృత చేష్టలను పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తున్నాడని, తన అభిమానులు చేస్తోన్న పనులను ఖండించకుండా, వాటిపై ఏమీ మాట్లాడకుండా సైలెంటుగా ఉండడం ప్రోత్సహించడమేనని దుయ్యబట్టారు. చివరికి తన అభిమానులు చేస్తోన్న పనులు తనకు తెలియవని పవన్ చెప్పుకుంటారని ఆరోపణలు గుప్పించారు.
ఖండించడం పెద్ద విషయం ఏమీ కాదని, అంత చిన్న పనిని ఆయన ఎందుకు చేయడం లేదని, ఇటువంటివి జరగాలన్నదే పవన్ కల్యాణ్ అసలు ఉద్దేశమని, ఫ్యాన్స్ చేసే ఓవర్ యాక్షన్ గురించి అన్నీ తెలుసని ఆగ్రహం వ్యక్తం చేసారు. పవన్ కల్యాణ్ని కొందరు దేవుడని అంటున్నారని, ఆయన దేవుడా? అంటూ కత్తి ప్రశ్నించారు.
“ఒకవేళ తన ఫ్యాన్సు చేష్టలపై పవన్ కళ్యాణ్ స్పందిస్తే, ఆయనకు దాసోహం అయిపోతానని కీలక వ్యాఖ్యలు చేసారు. జనసేనాని రిప్లై ఇస్తే తాను ఆయన పార్టీలో చేరడానికి కూడా రెడీ అని, తనకు మద్దతుగా స్పందించాలని తాను కోరడం లేదని, పవన్ ఎలా స్పందించినా తనకు సరేనని అన్నారు.
తన ఫ్యాన్స్ ఇంతేనని, మీ చావు మీరు చావండి అని పవన్ చెప్పినా తనకు ఓకేనని, తనకు పవన్ కళ్యాణ్ స్పందన మాత్రమే కావాలని, ‘ఆయన నెగిటివ్గా స్పందిస్తాడా? పాజిటివ్గా స్పందిస్తాడా?’ అన్న విషయం తనకు అనవసరమని అన్నారు. అభిమానులు పవన్ ని దేవుడు అని అంటున్నారని, ఆయన ఎంతటి దేవుడో తానూ చూస్తానని మహేశ్ కత్తి సవాల్ విసిరారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలను ప్రక్షాళన చేస్తాడని కొందరు నమ్ముతున్నారని, అయితే ముందుగా తన అభిమానులను ప్రక్షాళన చేస్తే తాను కూడా విశ్వసిస్తానని ఫైనల్ పంచ్ ఇచ్చారు కత్తి. అంతేకాదు, అది జరిగిన నాడు ఖచ్చితంగా తానూ కూడా జనసేన జెండా పట్టుకుని పార్టీ కోసం నిస్వార్ధంగా సేవ చేస్తానని చెప్పుకొచ్చారు.