తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రముఖులు ఒక్కొక్కరుగా ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దకు చేరుతున్నట్టుగా కనిపిస్తుంది. మొన్న ఆ మధ్య మెగాస్టార్ చిరంజీవి అమరావతి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి చూడాల్సిందిగా ఆయనను ఆహ్వాహించారు.
సినీ పరిశ్రమ పెద్దలను జగన్ తో కలిపిస్తా అని కూడా చిరంజీవి చెప్పి వచ్చారట. తాజాగా ఇప్పుడు మహేష్ బాబు కుటుంబం కూడా జగన్ దగ్గరకు వెళ్లినట్టుగా ఉంది. జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిని మహేష్ బాబు భార్య నమ్రత కాసేపటి క్రితం తాడేపల్లి లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి కాసేపటి క్రితం కలిశారు.
మహేష్ దత్తత తీసుకున్న గ్రామాల అభివృద్ధిని భారతికి నమ్రత వివరించారని సమాచారం. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వపరంగా సహకారం అందించాలని కోరారు. మరోవైపు, తమ ఇంటికి వచ్చిన నమ్రతకు భారతి సాదర స్వాగతం పలికారు. ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. పలు అంశాలపై చర్చించుకున్నారు.
మహేష్ బాబు ముఖ్యమంత్రిని కలుస్తారేమో చూడాలి. ఇది ఇలా ఉండగా చిరంజీవి జగన్ ను సైరా చూడాల్సిందిగా ఆహ్వానించి రెండు వారాలు కావొస్తున్నా ఇప్పటివరకు ముఖ్యమంత్రి సినిమా చూడకపోవడం విశేషం. దీనితో మెగా అభిమానులు జగన్ మీద గుర్రుగా ఉన్నారు.