Mahesh Babu Tweets Ban Notes Black Moneyచాలా అరుదుగా మాత్రమే తన ట్విట్టర్ ను వినియోగించే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంపై స్పందించడం విశేషం. సహజంగా రాజకీయ నాయకులు చేసే ట్వీట్లకు బహు దూరంగా ఉండే మహేష్ బాబు నుండి ఊహించినది కాకపోవడంతో, టాలీవుడ్ వర్గాలకు ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. ఏది ఏమైతేనేం… ప్రిన్స్ ట్వీట్ సోషల్ మీడియాలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

“దేశ ఆర్ధిక వ్యవస్థకు ఒక ఆహ్లాదకరమైన చేంజ్ ను తీసుకువచ్చారని, ప్రజల మనిషి, ప్రజల కొరకు, ప్రజల చేత ఎన్నుకోబడిన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు సెల్యూట్” అంటూ లేటుగా ఇచ్చినా, లేటెస్ట్ గా ఇచ్చాడు ప్రిన్స్. నిజానికి మోడీ చేసిన ప్రకటనపై నేడు ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ తన బహిరంగ సమావేశం ఓ ప్రకటన చేస్తారని ఆశించిన సమయంలో… పవన్ ఆ అంశాన్ని టచ్ చేయకుండానే ప్రసంగాన్ని ముగించారు.

కానీ, ఎవరూ ఊహించని విధంగా మహేష్ ఈ అంశంపై స్పందించి అభిమానులను కూడా ఆశ్చర్యపరిచారు. ఒక విధంగా మోడీ చేసిన ప్రకటన దేశం మొత్తాన్ని ఎంత షాక్ కు గురిచేసిందో, మహేష్ చేసిన ట్వీట్ కూడా అభిమానులను అంతే ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ ట్వీట్ తో ‘బ్లాక్ మనీ’పై ప్రిన్స్ తనకున్న అభిప్రాయాన్ని పరోక్షంగా చెప్పినట్లే కదా!