సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మహర్షి సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం ఏప్రిల్ చివరి వారంలో విడుదల కాబోతుందని సమాచారం. ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ చిత్రం. కాబట్టి దీని మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. మరోవైపు మహేష్ బాబు జియోతో కలిసి ఓ వెబ్ సిరీస్ను నిర్మించడానికి సిద్ధం అవుతున్నారు. నాన్నకు ప్రేమతో చిత్రానికి రచయితగా పని చేసిన హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్కు ‘చార్లీ’ అనే టైటిల్ను ఫిక్స్ చేశారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్కు లీడ్ యాక్టర్స్ను ఫిక్స్ చేసే పనిలో ఉన్నాడు సూపర్ స్టార్. డిటెక్టివ్ తరహా కథతో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్లో హీరో పాత్ర బాండ్ తరహాలో అలరించనుంది.అందుకే ఈ క్యారెక్టర్ తన ఫ్యామిలీకి చెందిన హీరోతోనే చేయించే ఆలోచనలో ఉన్నాడట మహేష్. ఇప్పటికే మహేష్ అన్న, ఒకప్పటి హీరో రమేష్ బాబు కుమారుడు హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అన్నీ కుదిరితే అన్న కొడుకునే హీరోగా పెట్టి ఈ వెబ్ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాడు మహేష్.
ఒకవేళ కాకపోతే మహేష్ బావ, గల్లా జయదేవ్ కుమారుడు కూడా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. వీరిద్దరిలో ఒకరు చార్లీలో టైటిల్లో రోల్లో కనిపించే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. మరి మహేష్ ఎవరిని ఫైనల్ చేస్తాడో చూడాలి. మహేష్ శ్రీమతి నమ్రత ఈ వెబ్ సిరీస్ నిర్మాణాన్ని దగ్గరుండి చూసుకుంటారని తెలుస్తుంది. గతంలో ఒకటి రెండు తన సినిమాలకే మహేష్ బాబు సహా నిర్మాతగా వ్యవహరించిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు కూడా అదే బ్యానర్ (జీ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ పై. లిమిటెడ్) మీద ఈ వెబ్ సిరీస్ కూడా నిర్మించబోతున్నారు.