స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులకు ఒక సంచలన వార్త ట్రేడ్ వర్గాలలో హల్చల్ చేస్తోంది. అదేమిటంటే… “అల్లూరి సీతారామరాజు” సినిమాకు సంబంధించిన ‘ప్రీక్వెల్’ సమాచారం కావడం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. సూపర్ స్టార్ కెరీర్ లో 100వ సినిమాగా విడుదలైన “అల్లూరి సీతారామరాజు” ప్రభంజనం ప్రేక్షకులకు తెలియనిది కాదు. కొన్ని సినిమాలు ఒక తరం వారు మాత్రమే వీక్షించగలిగే విధంగా ఉంటాయి. కానీ, ‘అల్లూరి సీతారామరాజు’ అనే సినిమా ఎన్ని తరాల వారినైనా అలరించగలిగే అతికొద్ది ‘క్లాసిక్’ సినిమాలలో ఒకటి.
ఇప్పుడు అలాంటి సినిమాకు ‘ప్రీక్వెల్’ రంగం సిద్ధమవుతోందని, ఈ సినిమాలో మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ ప్రధాన పాత్ర పోషించబోతున్నారనే సమాచారం ప్రిన్స్ అభిమానుల్లో ఉత్సాహం నింపుతోంది. రామ్ గోపాల్ వర్మతో ‘అనగనగా ఒక రోజు,’ కృష్ణవంశీతో ‘గులాభి’ సినిమాల రచయిత నడిమింటి నరసింగరావు ఈ సినిమా కధను సిద్ధం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. “శ్రీరామరాజు” పేరుతో రూపుదిద్దుకున్న ఈ కధలో… ‘అల్లూరి సీతారామరాజు పోరాట యోధునిగా మారడానికి బాల్య జీవితం ఎలా ప్రభావితం చేసింది’ అన్నదే ప్రధాన కధాంశమని తెలుస్తోంది.
ఈ సినిమా స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైందని, అన్ని కుదిరితే కృష్ణవంశీ దర్శకత్వం వహించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మరో టాక్. తానూ దర్శకుడు కావడానికి ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా ప్రభావం చాలా ఉందని చెప్పిన కృష్ణవంశీ, దేశ భక్తి సినిమాలను తెరకెక్కించడంలో దిట్ట అన్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాలిస్తే… ప్రిన్స్ అభిమానులకు అంతకు మించిన సంతోషకరమైన వార్త మరొకటి ఉండదని చెప్పడంలో సందేహం లేదు. ‘1 నేనొక్కడినే’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన గౌతమ్ కు ‘అల్లూరి సీతారామరాజు’ ప్రీక్వెల్ పాత్ర వశమైతే, ఈ సినిమాలో కృష్ణ, మహేష్ బాబులు ప్రత్యేక పాత్రలు పోషించడం తధ్యమన్నది అసలు ‘ట్విస్ట్.’