Mahesh-Babu-Shooting Ahmedabadమురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటిస్తోన్న సినిమా ప్రస్తుతం గుజరాత్ లోని అహ్మదాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ప్రిన్స్ మహేష్ బాబుతో పాటు చిత్ర ప్రధాన తారాగణం అంతా పాల్గొంటోంది. మోడీ అడ్డాగా భావించే గుజరాత్ లో మహేష్ బాబుకు ప్రేక్షకులు పట్టం కట్టడం విశేషం. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో అనేక మంది ప్రేక్షకులు వచ్చి తిలకించడం, మహేష్ బాబుతో ఫోటోలు దిగడంతో ప్రిన్స్ స్టార్ డంకు అవాక్కయ్యారట.

దక్షిణాదిలో అంటే సినిమాలపై సహజంగా ఉండే క్రేజ్ రీత్యా ఇలా సినీ సెలబ్రిటీలు కనపడగానే జనాలు గూమిగూడిపోవడం, ఫోటోలు దిగడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ ఒరవడి ఉత్తరాదిలో కాస్త తక్కువేనని చెప్పాలి. అయితే ప్రిన్స్ ఎంట్రీతో ఉత్తరాదిన కూడా ఇలాంటి సందడి వాతావరణమే నెలకొనడం విశేషం. షూటింగ్ కు కాసేపు బ్రేక్ ఇచ్చి మరీ అక్కడికి వచ్చిన అభిమానులతో ప్రిన్స్ ఫోటోలు దిగడంతో… అవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

మహేష్ తో పాటు దర్శకుడు మురుగదాస్ కూడా ఉత్తరాదిన సుపరిచితమే. ‘గజినీ’ సినిమాను హిందీలో రీమేక్ చేసిన మురుగదాస్, ఇటీవల సోనక్షి సిన్హాతో ‘అఖిరా’ సినిమాను తెరకెక్కించారు. మరో విశేషమేమిటంటే… మురుగదాస్ ‘గజినీ’ సినిమా షూటింగ్ ను అహ్మదాబాద్ లో చిత్రీకరించారు. సరికొత్త లొకేషన్లలో షూటింగ్ చేయాలన్న తలంపుతో అహ్మదాబాద్ ను ఎంపిక చేసుకోగా, డిసెంబర్ 23వ తేదీ వరకు ఈ షెడ్యూల్ నిరంతరాయంగా కొనసాగనుంది.