Mahesh Babu Selfie Talasani Srinivas Yadav Daughter Swathi తెలంగాణా రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ద్వితీయ పుత్రిక స్వాతి వివాహం కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా జరిగింది. కానీ రిసెప్షన్ వేడుక మాత్రం సినీ, రాజకీయ ప్రముఖుల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని నోవాటెల్ లో హోటల్ జరిగిన ఈ వేడుకకు టాలీవుడ్ నుండి ప్రస్తుత అగ్ర హీరోలుగా కొనసాగుతున్న వారంతా క్యూలు కట్టడం విశేషం. చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి వేడుకల్లో దర్శనమిచ్చే పవన్, మహేష్ లు కూడా ఈ వేడుకకు విచ్చేయడంతో మరింత ప్రాధాన్యతను దక్కించుకుంది.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి పవన్ కళ్యాణ్ హాజరు కాగా, ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అక్కినేని అఖిల్, నందమూరి నటసింహం బాలకృష్ణ, గోపీచంద్, రాజేంద్ర ప్రసాద్, మంచు విష్ణు, మనోజ్ వంటి హీరోలు విచ్చేయడంతో వేడుక మొత్తం కళకళలాడింది. అలాగే కొరటాల శివ, రాఘవేంద్రరావు, కోడి రామకృష్ణ, ఎస్వీ కృష్ణారెడ్డి, దర్శకరత్న దాసరి నారాయణరావు, కృష్ణంరాజు, సునీల్, శివాజీరాజా, అల్లు అరవింద్, సంపూర్ణేష్ బాబుతో మరికొందరు కమెడియన్లు కూడా ఆతిధ్యం స్వీకరించారు.

అయితే ఈ మొత్తం వేడుకలో హైలైట్ గా నిలుస్తోంది మాత్రం తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమార్తె స్వాతి ప్రిన్స్ మహేష్ బాబుతో కలిసి దిగిన సెల్ఫీ. చాలా మంది హీరోలు, పెద్దలు విచ్చేసినప్పటికీ, ఎవరితోనూ సెల్ఫీ దిగని పెళ్లికుమార్తె స్వాతి ప్రిన్స్ తో ఆ ముచ్చట తీర్చుకుని, కాసేపు కబుర్లు కూడా చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ సెల్ఫీ ఫోటో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. బహుశా తలసాని కుమార్తె ప్రిన్స్ మహేష్ బాబుకు వీరాభిమాని కావడం వలనే, ఇతర హీరోలను మించి ప్రిన్స్ ను కాస్తంత ‘స్పెషల్’గా భావించిందేమో!