‘బాహుబలి’ స్థాయిలో ఒక చారిత్రాత్మక సినిమాను సుందర్ సి తీయనున్నారని, తమిళంలో విజయ్, తెలుగులో మహేష్ బాబుతో ఈ సినిమాను రూపకల్పన చేయనున్నారని, దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ తో దీనిని తెరకిక్కెంచనున్నారన్న ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. ఈ వార్తలను మరింత బలపరిచే విధంగా, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లోకి ఏఆర్ రెహ్మాన్ ఎంటర్ అయ్యారు. దీంతో ‘బాహుబలి’ రేంజ్ లోనే ఈ సినిమా తయారు కావడం తధ్యమని ఖరారైంది.
అయితే ఈ సినిమాలో నటించేందుకు ప్రిన్స్ ‘రెడ్ సిగ్నల్’ వేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం మురుగదాస్ ప్రాజెక్ట్ పైనే దృష్టి కేంద్రీకరించాలనే ఉద్దేశ్యంతో ఇప్పట్లో ఈ సినిమాను చేయలేనని మొహమాటం లేకుండా చెప్పేసారని సినీ వర్గాలలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో నటించేందుకు గానూ దాదాపు 30 కోట్ల రెమ్యూనరేషన్ ను ప్రిన్స్ కు ఆఫర్ చేసినా ఫలితం లేకపోయిందని ట్రేడ్ వర్గాలలో వినపడుతున్న మాటలు. అయితే ఈ సినిమా ఒప్పుకోకపోవడానికి మరో కారణం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది.
తన కెరీర్ తొలినాళ్ళ నుండి ఎక్కువగా తెలుగు దర్శకులతోనే ప్రిన్స్ పని చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా మణిరత్నం వంటి సుప్రసిద్ధ తమిళ దర్శకులు మహేష్ తో సినిమా తీయాలని ప్రయత్నించినప్పటికీ అవేమీ కార్యరూపం దాల్చలేదు. అంతకు ముందు సూర్యతో ‘నాని’ తర్వాత ప్రస్తుతం మురుగదాస్ లకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ లభించింది. మరో దర్శకుడు లింగుస్వామి అయితే దాదాపుగా ఒక దశాబ్దం నుండి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో మురుగదాస్ వెంటనే మరో తమిళ దర్శకుడితో సినిమా చేయడమంటే అది రిస్క్ తో కూడుకున్న వ్యవహారం కావడం వల్లనే సున్నితంగా ఈ సినిమాను తిరస్కరించాడని టాక్.