Mahesh Babu Rajamouli Movieటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు – దర్శకధీరుడు రాజమౌళి కాంబో కోసం అభిమానులే కాదు, ట్రేడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. వీరిద్దరి కలయికలో మూవీ అని ప్రకటించిన నాటి నుండి, ఈ సినిమా కధ ఏమై ఉంటుందా? అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో ఈ ప్రశ్న జక్కన్నకు ఎదురయ్యింది గానీ, ఇంతవరకు ఏది ఫైనల్ కాలేదని అన్నారు.

కానీ తాజాగా రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై హింట్ అయితే ఇచ్చారు. ఆఫ్రికా నేపధ్యంలో ఓ కధ అనుకుంటున్నామని, రాజమౌళికి కూడా ఫారెస్ట్ అంటే ఎంతో ఇష్టమని, ప్రకృతి, జంతువులు అంటే బాగా ఇష్టపడతాడని, సినిమా పరంగా కూడా వాటిపై ఓ సినిమా తీయాలని ఎప్పటి నుండో అనుకుంటున్నాడని అన్నారు.

అయితే ‘ఆర్ఆర్ఆర్’ మైండ్ లో నుండి వెళ్లే వరకు రాజమౌళి ఏది వినడని, బహుశా సినిమా రిలీజ్ అయ్యి, ఓ పది, పదిహేను రోజుల తర్వాత తదుపరి సినిమా కధ గురించి ఆలోచిస్తాడని, అప్పుడు చెప్తానని అన్నారు. ఆఫ్రికా నేపధ్యంలో కధ అన్న విషయం ఇప్పటిది కాదు. వీరిద్దరి కాంబోలో సినిమా అన్న తర్వాత, తొలుత లీక్ అయిన విషయం ఇదే. బహుశా అదే పాయింట్ తో ముందుకు వెళ్తున్నారేమో అన్న సంకేతాలు విజయేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలతో స్పష్టమైంది.

ఈ సినిమా మల్టీస్టార్ కాదు, మహేష్ బాబు సోలో పెర్ఫార్మన్స్ అన్న విషయాన్ని జక్కన్న ఇప్పటికే స్పష్టం చేసారు. అలాగే సాదాసీదాగా ఉండబోదు, లార్జ్ స్కేల్ లోనే ఈ సినిమా ఉండనుందని కూడా ఇటీవల తెలిపారు. “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్స్ పుణ్యమా అంటూ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కు సంబంధించిన విషయాలు తెలుస్తుండడంతో మహేష్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు.