mahesh babu - purijaganadh janaganamana“పోకిరి, బిజినెస్ మెన్” వంటి వినూత్నమైన కధలను అందించిన పూరీ జగన్నాధ్ తో మరో సినిమా రావాలని ఎన్నాళ్ళుగానో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. గతంలో ప్రకటించిన “జనగణమన” అయినా ఏదొక సమయంలో సెట్స్ పైకి తీసుకువెళ్తారేమో అన్న ఆశతో ఉండగా, ఇక దీనికి కూడా శుభంకార్డు పడిపోయింది.

ప్రస్తుతం విజయ్ దేవరకొండతో “లైగర్” సినిమాను తెరకెక్కిస్తోన్న పూరీ జగన్నాధ్, “జనగణమన” సినిమాను కూడా విజయ్ తోనే చేయబోతున్నారని ఇటీవల వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే. వాటిని నిజం చేస్తూ ఈ సినిమా ప్రారంభ ముహూర్తం కూడా నిర్ణయం జరిగింది. 29వ తేదీ మధ్యాహ్నం 2.20 నిముషాలకు తమ మిషన్ ను ప్రారంభిస్తున్నామని పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలియజేసారు.

మహేష్ తో ‘బిజినెస్ మెన్’ తర్వాత ప్రకటించిన “జనగణమన” సబ్జెక్టు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కధ మహేష్ ను మాత్రమే ఎంచుకుని రాసానని, ఒకానొక సందర్భంలో స్వయంగా పూరీ జగన్నాధ్ వెల్లడించారు. అలాగే ఈ సబ్జెక్టు “హీరోయిజాన్ని పతాక స్థాయిలో చూపించేదని” అప్పట్లో రాంగోపాల్ వర్మ కూడా సంచలన వ్యాఖ్యలు చేసారు.

కానీ దీనికి ‘సూపర్ స్టార్’ నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో, విజయ్ దేవరకొండతో ముందుకు వెళ్తున్నారు పూరీ. ‘లైగర్’ సినిమా ఫలితం రాకముందే సెట్స్ పైకి వెళ్ళబోతున్న ఈ సినిమా మరెన్ని సంచలనాలకు నాంది కాబోతుందో వేచిచూడాలి. రవితేజ తర్వాత వరుసగా రెండో సినిమాను విజయ్ దేవరకొండతోనే చేయబోతున్నారు పూరీ.