mahesh babu opens on brahmotsavam failureశ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన “బ్రహ్మోత్సవం” కధను ఎంపిక చేసుకోవడం అనేది కెరీర్ లో ప్రిన్స్ మహేష్ బాబు వేసిన భారీ తప్పటడుగుగా అప్పట్లో సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డ సంగతి తెలిసిందే. ముఖ్యంగా ‘శ్రీమంతుడు’ సినిమా తర్వాత అదే తరహా పాత్రను ఎంపిక చేసుకోవడం అనేది మహేష్ చేసిన మొదటి తప్పుగా అభివర్ణించారు. తాజాగా ‘స్పైడర్’ సినిమా ప్రమోషన్స్ లో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని మహేష్ బాబు కూడా అంగీకరించారు.

‘బ్రహ్మోత్సవం’ చేయడం తన రాంగ్ డెసిషన్ అని చెప్పిన మహేష్, అయితే ఇలాంటివే తనకు పాఠాలు నేర్పుతుంటాయని అన్నారు. ‘బ్రహ్మోత్సవం’ సినిమా విడుదల తర్వాత బాగా డిజప్పాయింట్ అయిన మాట నిజం అని, దాని నుండి బయటపడేసింది తన పిల్లలే అని, ఈ సినిమా వలన చాలా మంది బాధపడ్డారని, తనను నమ్మి డబ్బులు పెట్టిన వారు ఇబ్బందులు పడ్డారని, ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూసుకోవడమే తన బాధ్యత అని చెప్పారు ప్రిన్స్.

జీవితంలో అన్ని అనుకున్నట్లు జరగవని, మనం అనుకున్నవి కొన్ని తలక్రిందులు అవుతుంటాయని, ‘బ్రహ్మోత్సవం’ కూడా అలాంటిదేనని కాస్త వేదాంతధోరణిలో కూడా మాట్లాడారు. “స్పైడర్” ఫలితంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, ఈ కధ యూనివర్సల్ కావడంతో, రెండు భాషల్లో కూడా విజయవంతం అవుతుందన్న నమ్మకాన్ని వ్యక్తపరిచిన ప్రిన్స్, ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న “భరత్ అనే నేను” గురించి మాట్లాడడానికి ఆసక్తి కనపరచలేదు. షూటింగ్ ఇటీవలే మొదలైందని, ఇప్పుడే మాట్లాడడం సరైనది కాదని అన్నారు.