Mahesh Babu NTR Cameo in Shatamanam Bhavatiసినీ అభిమానులకు పండగ వాతావరణం వచ్చేసింది. నేడు మెగాస్టార్ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వగా, రేపు నందమూరి నటసింహం దర్శనమివ్వనున్నాడు. ఆ తర్వాత శనివారం నాడు శర్వానంద్ ‘శతమానం భవతి’ అంటూ పండగ సందడి చేయనున్నాడు. బరిలో ఉన్న మూడు సినిమాలలో అతి తక్కువ అంచనాలతో విడుదలవుతున్న ఈ సినిమాపై ప్రస్తుతం ఓ వార్త హల్చల్ చేస్తోంది. అయితే ఇదేమీ సాధారణ వార్త కాదు, ఏకంగా ఈ సినిమా వైపుకు అందరూ తిరిగి చూసేలా ఈ సమాచారానికి ప్రాధాన్యత లభిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే… దిల్ రాజు నిర్మించిన ఈ “శతమానం భవతి” సినిమాలో ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లు అతిథి పాత్రలు పోషించినట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న టాక్. మరి ఇందులో వాస్తవం ఎంత ఉందో గానీ, ఒకవేళ ఇది నిజమైతే, మిగిలిన రెండు సినిమాలతో పాటు ‘శతమానం భవతి’ని సీరియస్ గా పరిగణించాల్సి ఉంటుంది. గతంలో జూనియర్ ఎన్టీఆర్, మహేష్ లతో ఫ్యామిలీ చిత్రాలను తీసిన ఘనత దిల్ రాజుది కావడంతో, దీనికి మరింత బలం చేకూరుతోంది.

అయితే సినిమా విడుదలకు రెండు, మూడు రోజుల ముందు ఇటీవల ‘ఫేక్ పబ్లిసిటీ’లు కూడా ఎక్కువైన నేపధ్యంలో, ఇది కూడా అందులో భాగమేనా లేక నిజమా అన్నది చిత్ర యూనిట్ సభ్యులే తెలియజేయాల్సి ఉంది. ఏది ఏమైనా ఒక మంచి కుటుంబ కధా చిత్రంగా “శతమానం భవతి” ఫ్యామిలీ ప్రేక్షకులను రంజింప చేయడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. మరి అసలు ఫలితం ఏమిటో ఈ 14వ తేదీన తేలిపోనుంది.