ఏడాదికి ఒక్క సినిమా విడుదల చేయడానికే గగనమైపోతున్న ప్రిన్స్ మహేష్ బాబు, గేర్ కాస్త పెంచినట్టున్నారు. ప్రస్తుతం మురుగదాస్ సినిమా సెట్స్ పైన ఉండగా, తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ‘బ్రహ్మోత్సవం’ నిర్మాత పివిపి నిర్మిస్తుండగా, ఇది కాక మరో మూడు సినిమాలకు ప్రిన్స్ ఓకే ఇచ్చారన్న సమాచారం హల్చల్ చేస్తోంది.
తనకు ‘శ్రీమంతుడు’ సినిమాను ఇచ్చిన కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించబోతున్న సినిమా ఒకటి కాగా, అదే ‘శ్రీమంతుడు’ సినిమా నిర్మాతలు మైత్రీ మూవీస్ బ్యానర్లో ప్రిన్స్ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మరో సినిమా ఉండబోతోందని సమాచారం. ఈ రెండు సినిమాలు కాకుండా, తాజాగా 14 రీల్స్ సంస్థలో మరో సినిమా చేయడానికి ప్రిన్స్ నుండి గ్రీన్ సిగ్నల్ లభించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శకుడు మాత్రం ఇంకా ఫైనల్ కాలేదని టాక్.
మరో పక్కన పూరీ జగన్నాధ్ క్యూలో ఉండడంతో ‘పూరీ – 14 రీల్స్’ కాంభినేషన్ సెట్ అయ్యే అవకాశం లేకపోలేదు అన్న సమాచారం కూడా ఉంది. నిజానికి అశ్వనిదత్ – పూరీల కాంభినేషన్లో ఓ సినిమా వస్తుందన్న ప్రచారం గతంలో జరిగిన విషయం తెలిసిందే. ఇవన్నీ కాక, టాలీవుడ్ ని షేక్ చేసే రాజమౌళి – మహేష్ కాంభినేషన్ లో కేఎల్ నారాయణ ఒక సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రిన్స్ కనపరుస్తున్న ‘దూకుడు’ అయితే బాగానే ఉంది గానీ, ఇవన్నీ కార్యరూపం సిద్ధించి, ఏడాదికి కనీసం రెండు సినిమాలైనా విడుదలైతే గానీ, మరో మూడేళ్ళ వరకు మరో కమిట్మెంట్ కు ఆస్కారం లేకుండా ఉంటుంది.