Mahesh babu new school building in Siddhapuramఆంధ్రప్రదేశ్ లో బుర్రిపాలెం, తెలంగాణాలో సిద్దాపురం గ్రామాలను టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఈ రెండు గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తే… ఎక్కువగా బుర్రిపాలెం అప్ డేట్స్ వస్తుంటాయి. ప్రిన్స్ కుటుంబానికి సంబంధించిన స్పెషల్ తేదీలలో బుర్రిపాలెంలో మెడికల్ క్యాంపులను నిర్వహించడం, అలాగే స్కూల్ పిల్లలకు ప్రత్యేక పోటీలు ఏర్పాటు చేయడం వంటి తదితర కార్యక్రమాలతో బుర్రిపాలెం పేరు మారుమ్రోగుతూనే ఉంటోంది.

అయితే తెలంగాణాలోని సిద్దాపురం గ్రామానికి సంబంధించి మాత్రం చాలా తక్కువ అప్ డేట్స్ వస్తుంటాయి. అవి కూడా ప్రిన్స్ సతీమణి నమ్రత నుండే వెలువడుతుంటాయి. అప్ డేట్స్ ఉన్నా, లేకున్నా గానీ సిద్దాపురంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు సైలెంట్ గా సాగుతున్నాయన్న విషయం తాజాగా స్పష్టమైంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ను ఫోటోలతో సహా సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపారు ప్రిన్స్.

సిద్దాపురంలో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోందని, దీనిని రూపొందించిన ఆర్కిటెక్ట్ సుధీర్ రెడ్డికి మరియు అతని టీం మెంబర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన మహేష్, ఈ అమేజింగ్ వర్క్ పూర్తి కావడానికి ఎదురుచూస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ స్కూల్ ప్రారంభోత్సవానికి బహుశా ప్రిన్స్ సిద్దాపురం వెళ్తారేమోనన్న సంకేతాలు ఈ పోస్ట్ చెప్పకనే చెప్తోంది. అంటే ఈ ఏడాదిలో సిద్దాపురంలో ప్రిన్స్ అడుగు పెట్టబోతున్నారన్న మాట.