సూపర్స్టార్ మహేశ్బాబు కథానాయకుడిగా నటిస్తున్న మహర్షి సినిమాకు వాయిదాల బెడద తప్పేలా లేదు. మొదట ఉగాది సందర్భంగా ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల 25కు వాయిదా వేశారు. ఏదేమైనా ఈ సినిమా కచ్చితంగా 25నే విడుదల చేస్తామని చిత్రబృందం ఇటీవల స్పష్టం చేసింది. అయితే అంతలోనే సినిమా మళ్లీ వాయిదా పడినట్లు చిత్ర నిర్మాత దిల్రాజు కాసేపటి క్రితం ఒక ప్రెస్ మీట్ పెట్టి స్పష్టం చేశారు. తాజాగా మహర్షిని మే 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు వెల్లడించారు.
మార్చి 17కి టాకీ పార్ట్ పూర్తవుతుందని పేర్కొన్నారు. మరో రెండు పాటల చిత్రీకరణ మిగిలుందని తెలిపారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం ఈ సినిమా ఆయన కేరీర్ లోనే బెస్ట్ అవుతుందని, ఈ స్క్రిప్టు కోసం ఆయన రెండు సంవత్సరాలు కష్టపడ్డారని దిల్ రాజు చెప్పుకొచ్చారు. మహర్షి మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమా. పూజా హెగ్డే కథానాయిక. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో ప్రముఖ నటుడు అల్లరి నరేశ్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
వరుసగా వస్తున్న ఈ వాయిదాలతో మహేష్ బాబు అభిమానులు ఢీలా పడ్డారు. అయితే మే 9న అంటే అప్పటికి ఎన్నికల తంతు ముగిసి పోయి, స్కూల్ కాలేజీ పిల్లలకు సెలవులు ఉండటంతో ఈ వాయిదా ఒక రకంగా మంచిదే అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. మహేష్ బాబు కేరీర్ లోనే అత్యంత బిగ్గెస్టు రిలీజ్ కోసం నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు. దిల్ రాజు, అశ్వినీ దత్, మరియు పొట్లూరి వర ప్రసాద్ అమెరికా నేపథ్యంలో జరిగే ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.