వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘మహర్షి’. గురువారం సినిమా డబ్బింగ్ పార్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి, నిర్మాత దిల్రాజు తదితరులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మహేశ్ మాత్రం ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. మరోవైపు సినిమా చివరి షెడ్యూల్ హైదరాబాద్ లో గత వారంలో మొదలయ్యింది. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో ఒక ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. రామ్ – లక్ష్మణ్ ఈ ఫైట్ ను రూపొందిస్తున్నారు.
మహేశ్ 25వ సినిమాగా ‘మహర్షి’ తెరకెక్కుతోంది. మహేశ్కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. ప్రముఖ నటుడు అల్లరి నరేశ్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సినిమాలో మహేశ్ పాత్ర పేరు రిషి. ఇందులో మహేశ్, నరేశ్ గడ్డంతో విభిన్నమైన లుక్లో కనిపిస్తారని తెలుస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థలు – శ్రీ వేంకటేశ్వర ఫిలింస్, వైజయంతి ఫిలింస్, పీవీపీసీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ఈ చిత్రం మొదటి లుక్ టీజర్ మార్చి 4న మహాశివరాత్రి సందర్భంగా విడుదల చేయబోతున్నారని సమాచారం. గతంలో ఏప్రిల్ 5న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అని చెప్పారు అయితే కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉండటంతో ఏప్రిల్ చివరి వారంలో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ 25న విడుదల చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం బట్టి మర్చి చివరి కల్లా సినిమా చిత్రీకరణ పూర్తి అవుతుంది.