Mahesh-Babu-Koratala-Siva gets relief from srimanthudu copyright case“శ్రీమంతుడు” సినిమా విషయంలో కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించారంటూ రచయిత ఆర్డీ విల్సన్ అలియాస్ శరత్ చంద్ర వేసిన కేసులో ప్రిన్స్ మహేష్ బాబుకు ఊరట లభించింది. ఈ ఏడాది జనవరి 24న నాంపల్లి కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమలును నిలిపి వేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకర నారాయణ తాజాగా ఆదేశాలు ఇచ్చారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా 2015లో విడుదలైన “శ్రీమంతుడు” చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే.

అయితే తన కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించి కాపీ రైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారంటూ రచయిత ఆర్డీ విల్సన్ అలియాస్ శరత్ చంద్ర నాంపల్లి కోర్టును గతంలో ఆశ్రయించారు. స్వాతి మాస పత్రికకు 2012లో తాను రాసిన ‘చచ్చేంత ప్రేమ’ నవల ఆధారంగా ‘శ్రీమంతుడు’ సినిమా తీశారని, కాపీ రైట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో రచయిత శరత్ చంద్ర పేర్కొన్నారు. ఈ కేసుపై విచారణ జరిపిన మొదటి అదనపు ఎంఎస్ జే కోర్టు, నటుడు మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ తదితరులకు సమన్లు జారీ చేసింది.

అయితే దీనిని సవాల్ చేస్తూ మహేశ్ బాబు ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, దర్శకుడు కొరటాల శివ వేర్వేరుగా కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై ఆయా న్యాయవాదుల వాదనలు విన్న జస్టిస్ శంకర నారాయణ, కింది కోర్టు జారీ చేసిన సమన్లు నిలిపివేయాలని ఆదేశించారు. దీంతో ప్రస్తుతానికి ‘శ్రీమంతుడు’ నుండి సేఫ్ గా బయటపడగలిగారు ప్రిన్స్.