mahesh babu in Dil Raju and Aswini Dutt co-productionఒక సినిమా పూర్తయ్యి, విడుదలై, దాని ఫలితం వచ్చిన తర్వాతనే మరో సినిమాను అంగీకరించి, సెట్స్ పైకి తీసుకెళ్ళాలి అనేది ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ తొలినాళ్ళ నుండి అవలంభిస్తున్న సూత్రం. అయితే ఇటీవల మాత్రం ఆ సూత్రాన్ని పక్కన పెట్టినట్లుగా కనపడుతోంది. ఇంతకు ముందేన్నాడూ లేని విధంగా “స్పైడర్” సినిమా షూటింగ్ ముగియక ముందే, “భరత్ అనే నేను” సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళిన ప్రిన్స్, తాజాగా మరో సినిమాకు శ్రీకారం చేయడం అభిమానులను షాక్ కు గురి చేస్తోంది.

‘స్పైడర్’ సినిమా విడుదల కావడానికి ఇంకా నెల రోజుల పైనే సమయం ఉంది. అలాగే ‘భరత్ అనే నేను’ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభం కాగా, ఈ ఏడాది చివరి వరకు ఈ సినిమా షూటింగ్ జరగనుంది. అయినప్పటికీ తన 25వ సినిమాను లాంచనంగా ఆగష్టు 14వ తేదీన పూజా కార్యక్రమాలతో జరపనున్నారు. యధావిధిగా ఈ సినిమా ప్రారంభ కార్యక్రమానికి మహేష్ రావడం లేదు. దర్శకుడు వంశీ పైడిపల్లి, నిర్మాతలు దిల్ రాజు, అశ్వనీదత్ లు ఈ పూజా కార్యక్రమాలకు హాజరు కానున్నారు.

తదుపరి రెండు సినిమాల విషయంలో ఉన్న క్లారిటీ 25వ సినిమా తర్వాత ఏంటన్న దానిపై స్పష్టత లేదు. సినిమా అయితే ఖరారు కాలేదు గానీ… జాబితా అయితే పెద్దే ఉంది. దర్శకధీరుడు రాజమౌళి పేరుతో మొదలై త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరీ జగన్నాధ్, బోయపాటి శ్రీను, వివి వినాయక్… ఇలా టాలీవుడ్ టాప్ దర్శకులందరూ ప్రిన్స్ జాబితాలో ఉన్నారు. వీరితో పాటు ‘స్పైడర్’ ఫలితం పాజిటివ్ గా ఉంటే, మురుగదాస్ తో మరో ద్విభాషా చిత్రం ఉండవచ్చని తెలుస్తోంది.