సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో తెలుగు దేశం పార్టీలో చేరారు.గురువారం రాత్రి విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో ఆయనతోపాటు 13 జిల్లాలనుంచి వచ్చిన కృష్ణ, మహేష్బాబు అభిమాన సంఘాల జిల్లాల అధ్యక్షులు కూడా పార్టీలో చేరారు. కృష్ణ, మహేష్ బాబు అభిమానుల సపోర్టు కోసమే చంద్రబాబు నాయుడు ఆయనను చేర్చుకున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మొదట్లో ఆదిశేషగిరిరావు గుంటూరు పార్లమెంట్ టిక్కెట్టు ఆశించారు. జగన్ మాత్రం విజయవాడ పార్లమెంట్ కు పోటీ చెయ్యమన్నారట. దీనితో ఆయన తెలుగుదేశం పార్టీ వైపు వచ్చారు. అయితే ఎంపీ టిక్కెట్టు ఇవ్వడం తమకూ కుదరదని ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తగిన విధంగా గౌరవిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు సమాచారం. దీనికి ఆయన ఒప్పుకున్నారట. ఆదిశేషగిరిరావు ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుట్టం కూడా కావడం విశేషం. అయితే చంద్రబాబు ఆయనకు ఈ హామీ ఇవ్వడం సొంత పార్టీ వారికే రుచించడం లేదు.
ఎప్పటినుండో పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారిని కాదని ఇటువంటి జంప్ జిలానీలకు పదవులు ఇవ్వడం వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అదే క్రమంలో ఈరోజు వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన యాత్ర సినిమా విడుదల అయ్యింది. ఈ సందర్భంగా థియేటర్ల వద్ద మహేష్ బాబు కృష్ణ అభిమానుల సందడి కనిపించింది. చాలా చోట్ల అభిమానులు ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. దీనితో ఈ చేరిక టీడీపీకి ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి. గత ఎన్నికలలో కృష్ణ అల్లుడు జయదేవ్ టీడీపీ నుండి పోటీ చేసి గుంటూరు ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే.