mahesh babu director vikram movieడైరెక్టర్స్ హీరోగా పేరు తెచ్చుకున్న ప్రిన్స్ మహేష్ బాబుతో సినిమా చేయాలన్న ఆకాంక్షను దాదాపుగా ప్రతి దర్శకుడు వ్యక్తపరుస్తుంటారు. అయితే ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు మాత్రమే చేస్తున్న ప్రిన్స్ వెయిటింగ్ లిస్టు దర్శకుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం “బ్రహ్మోత్సవం” సినిమా షూటింగ్ లో ఉన్న మహేష్, ఈ సినిమా తర్వాత తమిళ దర్శకుడు మురుగదాస్ తో జత కట్టనున్న విషయం ఇప్పటికే ఖరారయ్యింది.

ఇదిలా ఉంటే, మహేష్ తో తాను కూడా ఓ సినిమా చేయబోతున్నానని “ఇష్క్” దర్శకుడు విక్రమ్ కె కుమార్ తాజాగా ప్రకటించారు. ప్రస్తుతం తమిళ హీరో సూర్యతో “24” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విక్రమ్, తన తదుపరి రెండు చిత్రాలు తెలుగు హీరోలతోనే ఉంటాయని, ఒకటి ప్రిన్స్ మహేష్ బాబుతో, మరొకటి అల్లు అర్జున్ తో అని ప్రకటించారు. ప్రస్తుతం బన్నీ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్న ‘సరైనోడు’ చిత్రం మినహా ఏ చిత్రానికి కమిట్ కాలేదు. దీంతో ఈ సినిమా పూర్తి కాగానే విక్రమ్ సినిమాకు రెడీ అయిపోవచ్చు.

కానీ మహేష్ పరిస్థితి వేరు. ప్రిన్స్ జాబితాలో రాజమౌళి, త్రివిక్రమ్, పూరీ వంటి టాలీవుడ్ ను ఏలుతున్న దర్శకుల పేర్లున్నాయి. ఎవరి సినిమా ఎప్పుడు అన్న విషయం ఖరారు కాలేదు గానీ, స్వయంగా మహేషే వీరందరి పేర్లు వెల్లడించారు. వీరు కాక క్రిష్, శేఖర్ కమ్ముల వంటి వర్ధమాన దర్శకుల పేర్లు కూడా ప్రముఖంగా వినపడుతున్నాయి. మరి ఈ క్రమంలో “మనం” చిత్రంతో ఒక్కసారిగా హాట్ హాట్ గా మారిన విక్రమ్ నెంబర్ ఎప్పుడు వస్తుందనేది మహేష్ అభిమానులకు ఆసక్తికరంగా మారింది.