ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజును అభిమానులు ఘనంగా జరుపుకుంటున్న వేళ, దర్శకుడు పూరీ జగన్నాధ్ కు మాత్రం షాకింగ్ లాంటి వార్త వెలుగు చూసింది. అయితే ఈ షాక్ నేరుగా మహేష్ ఇవ్వకపోయినా, పివిపి సంస్థ విడుదల చేసిన పోస్టర్ పూరీని నేరుగా తాకింది. ప్రిన్స్ కు జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ… వంశీ పైడిపల్లి –మహేష్ బాబు కాంభినేషన్లో ఒక సినిమాను ప్రకటించింది పివిపి సంస్థ.
‘బ్రహ్మోత్సవం’ ఫలితం రీత్యా పివిపికి మరో సినిమాను ప్రిన్స్ ఇచ్చారని, దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తారన్న విషయం గతంలో వచ్చింది. అయితే దానిని ఈ రోజు పివిపి అధికారికంగా ధృవీకరించింది. అయితే ఈ మధ్యలో పూరీ జగన్నాధ్ “జనగణమన” టైటిల్ తో ప్రిన్స్ కాంభినేషన్ లో ఓ సినిమాను ప్రకటించడం, దీనికి మహేష్ నుండి కూడా స్పందన రావడం తదితర సంగతులు తెలిసినవే.
అయితే వంశీ పైడిపల్లి సినిమా తెరపైకి రావడంతో పూరీ సినిమా వెనక్కి వెళ్ళినట్లేనని ప్రిన్స్ చెప్పకనే చెప్పాడు. బహుశా ‘బ్రహ్మోత్సవం’ ద్వారా వచ్చిన నష్టాలను భర్తీ చేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారో ఏమో గానీ, వంశీ పైడిపల్లికి మాత్రం ప్రిన్స్ పుట్టినరోజు నాడు పండగ లాంటి వార్త బయటకు వచ్చింది. పివిపి – వంశీ కాంభినేషన్లో ఇప్పటికే ‘ఊపిరి’ సినిమా వచ్చి, ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.