Mahesh Babu puri jagannadh‘డైరెక్టర్స్ హీరో’గా సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇండస్ట్రీలో విశేషమైన పేరు ఉంది. ఒక్కసారి దర్శకుడిని విశ్వసిస్తే వాళ్ళు చెప్పింది చేసుకుంటూ పోవడం తప్ప, ఎందులోనూ తల దూర్చరన్న ఖ్యాతిని సొంతం చేసుకున్న మహేష్, తాజాగా ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ కార్యక్రమంలో కూడా తన దర్శకులపై ఉన్న నమ్మకాన్ని బయట పెట్టారు.

ఫ్రెండ్ తో ఫోన్ చేసుకునే సౌలభ్యాన్ని వినియోగించుకునేందుకు మహేష్ జాబితాలో మొత్తం తనతో పనిచేసిన దర్శకులనే ఎంచుకున్నారు. కొరటాల శివ, పూరీ జగన్నాధ్, సుకుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు వంశీ పైడిపల్లి… ఈ అయిదుగురి పేర్లు స్క్రీన్ పై తారసపడ్డాయి. ఈ అయిదుగురు దర్శకులలో ఒక్క పూరీ జగన్నాధ్ పేరు అంచనాలకు అందనిది.

ఒకానొక సందర్భంలో మహేష్ పై టంగ్ స్లిప్ అయిన పూరీపై సూపర్ స్టార్ అభిమానులు కూడా ఆగ్రహంతో ఉన్నారు. అప్పటినుండి పూరీ కూడా సూపర్ స్టార్ కు దూరంగానే ఉన్నారు. కానీ ఇవేమి మహేష్ కు పట్టవన్న విషయం వివిధ సందర్భాలలో తెలిసి వస్తోంది. ఇటీవల పూరీ పుట్టినరోజు నాడు కూడా మహేష్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలుపగా, తాజాగా ఫ్రెండ్ జాబితాలో పూరీ పేరును చేర్చడం విశేషం.

అంతేకాదు ఈ షోలో ‘సర్కార్ వారి పాట’ సినిమాపై స్పందిస్తూ… ఇది పూరీ గారి స్టైల్ లో ఉంటుందని, ‘పోకిరి’ వైబ్స్ ఉంటాయని స్వయంగా మహేష్ ప్రస్తావించారు. సూపర్ స్టార్ గా మహేష్ వ్యక్తిత్వానికి ఇదే నిదర్శనమంటూ మరోసారి సూపర్ స్టార్ అభిమానులు పూరీ జగన్నాధ్ ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. పబ్లిక్ ప్లాట్ ఫామ్ లో మహేష్ నుండి ఇది ఊహించని పూరీకి కూడా ఒక రకంగా షాక్ లాంటిదేమో!

ఈ ఇద్దరి కాంభినేషన్ లో వచ్చిన “పోకిరి, బిజినెస్ మెన్” చిత్రాలు అభిమానులకు కావాల్సినంత కిక్ ను పంచాయి. రెండు విభిన్నమైన షేడ్స్ లో మహేష్ ను ప్రెజెంట్ చేసిన విధానానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మూడవ సినిమాగా “జనగణమన” సినిమాను కూడా ప్రకటించారు. అది పట్టాలు ఎక్కకపోవడమే… నాటి పూరీ ఆవేదనకు కారణం! ఇక్కడితో అయినా విభేదాలు తొలగి ‘హ్యాట్రిక్’ మూవీ ప్రకటన మళ్ళీ వస్తుందేమో చూడాలి.