‘స్వచ్చ భారత్’కు సంబంధించి పలువురు సినీ ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోడీ లేఖలు రాసిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళితో సహా ప్రిన్స్ మహేష్ బాబుకు కూడా ఈ లేఖలు రాసారని వార్తలు వచ్చాయి. రాజమౌళి అయితే వచ్చిన లేఖను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, మోడీకి ధన్యవాదాలు తెలపడంతో, ఈ వార్తలకు మరింత ప్రాధాన్యత లభించింది. అయితే గత ఎన్నికలలో బిజెపి తరపున ప్రచారం నిర్వహించిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను వదిలిపెట్టి, మహేష్ కు లేఖ రాయడంపై పవన్ ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు.
అయితే తనకు మోడీ రాసిన లేఖపై ప్రిన్స్ మహేష్ బాబు స్పష్టత ఇచ్చారు. “స్పైడర్” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు ప్రింట్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోడీ లేఖపై ప్రశ్న రాగా… “లేదండి… అలాంటి ఉత్తరమేమి రాలేదు, అదంతా ఒక వదంతు మాత్రమే” అంటూ ప్రిన్స్ క్లారిటీ ఇచ్చారు. దీంతో పవన్ ను పక్కనపెట్టి మహేష్ కు లేఖ రాసారని ఆగ్రహించిన పవర్ స్టార్ ఫ్యాన్స్ కు, ఈ మాటలు ఊరటనిచ్చినట్లయ్యింది. ఈ సందర్భంగా రాజకీయాలకు – తనకు చాలా దూరం అని కూడా ప్రిన్స్ మరోసారి పూర్తి స్పష్టత ఇచ్చారు.