brahmotsavam mahesh babu samanthaబుల్లితెరపై ప్రిన్స్ మహేష్ బాబు సినిమాలకుండే డిమాండ్ ఇతర అగ్ర హీరోల కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఫ్యామిలీ హీరోగా కుటుంబ ప్రేక్షకుల్లో ప్రిన్స్ కు మంచి ఫాలోయింగ్ ఉండడమే దీనికి ప్రధాన కారణం. అందుకనే ప్రిన్స్ నటించే చిత్రాల శాటిలైట్ హక్కులు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. తాజాగా ప్రిన్స్ నటిస్తున్న “బ్రహ్మోత్సవం” కూడా ఈ జాబితాలోనే చేరింది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకుంటున్న “బ్రహ్మోత్సవం” సినిమా బుల్లితెర హక్కులు షాక్ ఇచ్చే ధరను చెల్లించి ప్రముఖ జీ టెలివిజన్ యాజమాన్యం సొంతం చేసుకుందని తెలుస్తోంది. యాడ్ ల నిబంధనలు సరళీకృతం చేసిన తర్వాత, దాదాపుగా 11.5 కోట్లు వెచ్చించి “బ్రహ్మోత్సవం” హక్కులను దక్కించుకోవడం ఇండస్ట్రీ వర్గాలను అవాక్కు చేసింది.

ఇక, ఏప్రిల్ 2వ తేదీ నుండి హైదరాబాద్ లో జరగనున్న చివరి షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఏప్రిల్ 24వ తేదీన ఆడియోను తిరుపతిలో అత్యంత వైభవంగా విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అలాగే మే రెండవ వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.