దిల్రాజు, వంశీ పైడిపల్లి కాంబినేషన్లో ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘మహర్షి’. మహేశ్ కథానాయకుడిగా నటించారు. పూజా హెగ్డే కథానాయిక. మిశ్రమ టాక్ తో మొదలయినా కలెక్షన్లు స్థిరంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో విజయాన్ని పురస్కరించుకుంటూ కాసేపటి క్రితం చిత్ర బృందం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి యూనిట్ సభ్యులు హాజరై, సినిమాతో తమకున్న జ్ఞాపకాల్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మహేష్ ఉద్వేగభరితంగా మాట్లాడారు.
“నా కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ను ‘మహర్షి’తో ఒక వారంలో దాటేయబోతున్నాం. దీనికి మించింది నాకు ఏమీ లేదు. దర్శకుడు వంశీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ‘మహర్షి’ విడుదల తర్వాత నాన్న అభిమానులు, నా అభిమానులు కాలర్ ఎత్తుకుని తిరుగుతారు అన్నారు. వాళ్లు కాలర్ ఎత్తారు వంశీ.. ఇప్పుడు నేను కూడా కాలర్ ఎత్తుతున్నా” అంటూ .. మహేశ్ కాలర్ ఎగరేశారు..ఆనందంలో వంశీ మహేశ్ను కౌగిలించుకున్నారు. ఈ చిత్రం మిశ్రమ టాక్ వచ్చిన మాట వాస్తవమే… కాకపోతే వేసవి సెలవుల అడ్వాంటేజ్ వల్ల బాగా ఆడుతుంది.
దాదాపుగా 100 కోట్లు కలెక్టు చేస్తే గానీ సేఫ్ అవ్వదు. సేఫ్ అయినా చిత్రంలో మైనస్ పాయింట్లు చెరిగిపోవు. సినిమా చూసిన నాటి నుండీ మహేష్ బాబు అభిమానులు కూడా తమ ఫేవరెట్ హీరో మూసపద్ధతిలో వెళ్తున్నాడని… అర్జెంట్ గా తన పంథా మార్చుకోవాలని అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో ఈ ప్రారంభ వసూళ్లను చూసుకుని అసలు విషయాన్నీ వదిలేస్తే అది మహేష్ కే మంచిది కాదు. మరోవైపు రేపటి నుండి సినిమా ఎలా ఆడుతుంది అనేది కూడా చూడాల్సి ఉంది.