mahesh babu as brand ambassador for sachin tendulkar biopic‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్ కోసమే పుట్టిన పదం ‘క్రికెట్ దేవుడు.’ జెంటిల్మెన్ గేమ్ లో ఉన్న రికార్డులన్నింటిని తన వశం చేసుకున్న సచిన్, ఈ వారంలో తొలిసారిగా సిల్వర్ స్క్రీన్ పైకి అడుగు పెట్టబోతున్నాడు. ‘సచిన్ – ఎ బిలియన్ డ్రీమ్స్’ పేరుతో తెరకెక్కిన ‘క్రికెట్ దేవుడు’ జీవిత చరిత్ర 26వ తేదీన ప్రేక్షకులను పలకరించనున్న నేపధ్యంలో… సచిన్ అభిమానులంతా ఈ సినిమా కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

ఆ జాబితాలో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఉన్నారన్న విషయం శనివారం నాడు బయటపడింది. సహజంగానే సచిన్ బ్యాటింగ్ కు వీరాభిమాని అయితే మహేష్ బాబు… ఈ సినిమా గురించి ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకునేలా చేసింది. ‘ఒక వ్యక్తికి ఎన్ని పేర్లో…’ అంటూ మహేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారగా, దానికి సచిన్ టెండూల్కర్ ప్రతిస్పందించడం, ఈ ట్వీట్ ను మరింత స్పెషాలిటీగా మార్చేసింది.

ఎందుకంటే… సచిన్ కున్న అనేక మంది సెలబ్రిటీ వీరాభిమానుల్లో మహేష్ కూడా ఒకరు. జాతీయంగా, అంతర్జాతీయంగా మహేష్ ను మించిన వారు కూడా సచిన్ కు అభిమానుల జాబితాలో ఉన్నారు. కానీ మహేష్ ట్వీట్ కు కృతజ్ఞతలు చెప్తూ సచిన్ రీ ట్వీట్ చేయడం సాధారణం కాదు. బహుశా టాలీవుడ్ లో తన సినిమాకు మహేష్ బాబుని ‘బ్రాండ్ అంబాసిడర్’గా సచిన్ నియమించారో ఏమో గానీ, వీరిద్దరి ట్వీట్స్ అభిమానులను ఉత్సాహంలోకి నెట్టేసింది.

బహుశా నేడు హైదరాబాద్ లో జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 ఫైనల్లో ఈ ఇద్దరూ కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పటికే ప్రిన్స్ తనయుడు గౌతమ్ కృష్ణ మ్యాచ్ జరిగినప్పుడల్లా మైదానంలో ప్రత్యక్షం అవుతున్నాడు. ఈ సారి ఫైనల్లో ముంబై ఇండియన్స్ కూడా ఉంది కాబట్టి మహేష్ వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే గతంలో ముంబై ఇండియన్స్ విజయం సాధించిన సమయంలో కూడా మహేష్ ప్రత్యేకంగా ట్వీట్ చేసి జట్టుకు అభినందనలు తెలిపారు.