తన స్వగ్రామం బుర్రిపాలెంలో ఇటీవల పర్యటించిన ప్రిన్స్ మహేష్ బాబుకు అభిమానులు, ప్రజలు బ్రహ్మరధం పట్టిన విషయం తెలిసిందే. ఆశించిన దాని కంటే ఎక్కువగా సక్సెస్ కావడం… ప్రజలు పట్టం కట్టడంతో మరోసారి ప్రిన్స్ రాజకీయ తెరంగ్రేటం వార్తలు తెరపైకి వచ్చాయి. ‘బ్రహ్మోత్సవం’ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఇలాంటి రాజకీయ వార్తలపై ప్రిన్స్ క్లారిటీ ఇచ్చారు.
వచ్చే ఎన్నికలలో గల్లా జయదేవ్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారా… అని అడిగిన ప్రశ్నకు సూటిగా ‘లేదు’ అంటూ స్పష్టంగా చెప్పారు. రాజకీయాలకు, తనకు సంబంధం లేదని, అంతకు ముందు చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని, అయినా జయదేవ్ తరపున ఎవరో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, ప్రజల తరపున పోరాడే విధానం ఆయనకు ప్లస్ పాయింట్ అని తన బావకు కితాబిచ్చారు.
ఇక, మరో బావ సుధీర్ బాబు గురించి కూడా ప్రిన్స్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు. ‘మా కుటుంబం సహకారం లేకుండా స్వతంత్రంగా ఎదుగుతున్నాడని, అలాంటి ఎదుగుదలే కావాలని, అయితే సుధీర్ చాలా కష్టపడతాడని, దాని ఫలితమే ‘భాగీ’ సినిమాకు వచ్చిన పేరు ప్రఖ్యాతలుగా ప్రిన్స్ చెప్పుకొచ్చారు. తెలుగు పరిశ్రమను వదిలిపెట్టి బాలీవుడ్ కు వెళ్ళే స్టుపిడ్ అని తానూ చేయనని, తెలుగులో మరిన్ని మంచి సినిమాలు చేయాలని ఉందన్న ఆకాంక్షను వ్యక్తపరిచారు ప్రిన్స్.