mahesh-babuప్రిన్స్ మహేష్ బాబు 23వ చిత్రంగా మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సెట్స్ పైన ఉన్న ఈ సినిమాను ఠాగూర్ మధు అండ్ కో నిర్మిస్తున్నారు. అలాగే మహేష్ తదుపరి చిత్రంపై కూడా ఇప్పటికే ఓ స్పష్టత వచ్చింది. ‘శ్రీమంతుడు’ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించబోయే సినిమా జనవరి నుండి షూటింగ్ జరుపుకోబోతోంది. ఈ రెండు సినిమాల వరకు పూర్తి స్థాయి సమాచారం ఉండడంతో అభిమానులు కూడా ఫుల్ క్లారిటీతో ఉన్నారు.

అయితే మహేష్ 25వ చిత్రాన్ని ఎవరు నిర్మిస్తున్నారు? ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు? అన్న దానిపై వస్తున్న సమాచారం అభిమానులను రసకందాయంలో పడేస్తోంది. ‘శ్రీమంతుడు’ సినిమా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలో మహేష్ 25వ సినిమా ఉంటుందని, ఈ సినిమాకు ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తారన్న సమాచారం హల్చల్ చేస్తోంది. ఇదే నిజమైతే మహేష్ అభిమానులకు కావాల్సిన విషయం మరొకటి ఉండదని చెప్పడంలో సందేహం లేదు. దానికి కారణం ‘అతడు, ఖలేజా’ సినిమాలే!

ఇదిలా ఉంటే… ‘దూకుడు’ సినిమా విడుదలై, 5 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 14రీల్స్ సంస్థ ప్రిన్స్ అభిమానులను ఊరించే విధంగా ట్వీట్ చేయడం విశేషం. ‘దూకుడు’ విజయాన్ని గుర్తు చేసుకుంటూ… త్వరలోనే ఒక సర్ ప్రైజ్ న్యూస్ ను ‘సూపర్ ఫ్యాన్స్’ వింటారు అంటూ ఊరిస్తోంది. ఇప్పటికే మహేష్ తో మూడు సినిమాలను నిర్మించిన ఈ సంస్థ మరో సినిమాకు సన్నాహాలు చేస్తోందా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అదే అయితే డైరెక్టర్ ఎవరు?

ఈ రెండు సంస్థలతో పాటు ఇప్పటికే పివిపి సంస్థ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒక సినిమాకు పోస్టర్ ను కూడా విడుదల చేసారు. అలాగే గతంలో కే ఎల్ నారాయణ చెప్తూ… రాజమౌళి, మహేష్ కాంభినేషన్ లో ఒక సినిమాకు సన్నాహాలు జరుగుతున్నాయని అన్నారు. వీరు కాకుండా, అశ్వనీదత్ ప్రకటించిన విషయం అదనం. దీంతో ముందు ఏ కాంభినేషన్ సెట్ అవుతుందో గానీ, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి నాలుగైదు భారీ ప్రొడక్షన్ సంస్థలు ఇప్పటికే మహేష్ డేట్స్ పై కన్నేసాయన్న విషయం బహిర్గతమవుతోంది.