Mahesh-babu-25th movie producersప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్ లో 23వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత 24వ చిత్రంగా కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య బ్యానర్ లో ప్రిన్స్ చేయబోతున్నాడు. అయితే ప్రతిష్టాత్మక 25వ సినిమా గురించి ఇప్పటినుండే పలు రకాలు చర్చలు జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమా దర్శకుడు విషయంలో ఇప్పటివరకు నెలకొని ఉన్న సందేహాలకు ఇటీవలే కాస్త స్పష్టత వచ్చినట్లయ్యింది. ‘మాట ల మాంత్రికుడు’ త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ లు జతకట్టబోతున్నారన్న వార్త దాదాపుగా ఖరారైంది.

అయితే ఈ సినిమాను నిర్మించే సంస్థ విషయంలోనే ఇప్పుడు తర్జనభర్జనలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో మహేష్ కు బాగా సన్నిహితంగా మారిన ‘14 రీల్స్ – మైత్రీ మూవీ మేకర్స్’ సంస్థల మధ్య ఈ ప్రతిష్టాత్మక సినిమా కోసం తీవ్ర పోటీ నెలకొందని సినీ వర్గాల టాక్. త్రివిక్రమ్ శ్రీనివాస్ డేట్స్ మైత్రీ మూవీ మేకర్స్ వద్ద ఉండడంతో ముందుగా ఈ సినిమాను నిర్మించే అవకాశం వీరికే దక్కుతుందని భావించారు. మైత్రీ మూవీ మేకర్స్ కూడా త్వరలోనే మహేష్ తో మరో సినిమాను నిర్మించబోతున్నామని ఇప్పటికే ఓ ప్రకటన చేసింది. దీంతో ప్రిన్స్ 25వ సినిమా ‘శ్రీమంతుడు’ బ్యానర్ లోనే అని అభిమానులు గట్టిగా ఫిక్స్ అయ్యారు.

అయితే అనూహ్యంగా 14 రీల్స్ సంస్థ బరిలో నిలిచింది. తాజాగా ఈ సంస్థ చేసిన ప్రతిపాదనలు వర్కౌట్ అయ్యేలా ఉన్నాయని, మహేష్ కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. దీంతో త్రివిక్రమ్ సైడ్ నుండి మైత్రీ మూవీ మేకర్స్, మహేష్ సైడ్ నుండి 14 రీల్స్ పోటీ పడుతున్న తరుణంలో… చివరికి ఎవరు బరిలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. గత అనుభవాల దృష్ట్యా… ప్రిన్స్ అభిమానులు మాత్రం త్రివిక్రమ్ సైడ్ నిర్మాతలకే ఓటు వేస్తున్నారు. అది ఇది కాకపోతే… చివరి క్షణంలో ఏకంగా డైరెక్టర్ మారిపోతారేమో చూడాలి..?!