టాలీవుడ్ ప్రస్తుత 4 పిల్లర్స్ లో ముందుగా 25 సినిమాలను పూర్తి చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ ఏడాది విడుదలైన ‘నాన్నకు ప్రేమతో’ సినిమా ద్వారా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోకపోయినా, అంతకు మించిన ప్రశంసలను అందుకున్నాడు జూనియర్. ఆ తర్వాత లైన్ లో మహేష్, పవన్ ఉండగా, ప్రభాస్ ఇంకాస్త ఎక్కువ దూరంలో ఉన్నాడు. అయితే పవన్, మహేష్ లలో కూడా ఒకడుగు మహేష్ ముందు ఉండగా, పవన్ 25 మార్క్ కు చేరతాడో లేదో కూడా సందేహమే.
ఇదిలా ఉంటే ప్రస్తుం మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా ప్రిన్స్ కెరీర్లో 23వది. ఈ సినిమా తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 24వ సినిమా ఉండబోతుందని, తాజాగా పివిపి సంస్థ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరి ప్రతిష్టాత్మక 25వ సినిమా ఎవరి చేతుల్లో ఉండబోతోంది. ఈ జాబితాను పరిశీలిస్తే… డైరెక్టర్ల మధ్య భారీ ఫైట్ నెలకొన్నట్లుగా కనపడుతోంది. టాలీవుడ్ టాప్ దర్శకులందరికీ ప్రిన్స్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉండడంతో, 25వ సినిమా ఎవరి అకౌంట్ లో పడుతుందా? అన్న ఆసక్తి అభిమాన వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఒక్కసారి ఆ జాబితాను పరిశీలిస్తే… తొలుత దర్శకధీరుడు రాజమౌళి పేరు హల్చల్ చేస్తోంది. దీనిపై ఇప్పటికే ఒక అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ‘బాహుబలి 2’ సినిమా తర్వాత ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుందని స్వయంగా రాజమౌళినే ఒకానొక సమయంలో ప్రకటించాడు. మరో వైపు, ప్రిన్స్ కమిట్ అయిన మురుగదాస్, వంశీ పైడిపల్లి సినిమాలు పూర్తి అయ్యే నాటికి, మహేష్ – రాజమౌళిలు కలవడం ఖాయంగా కనపడుతుందని, దీంతో ప్రిన్స్ 25వ సినిమా జక్కన్న ఖాతాలో పడే అవకాశాలే ఎక్కువగా కనపడుతున్నాయని బలంగా వినపడుతున్న టాక్.
రాజమౌళి కాకపోతే, ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి కాంభినేషన్ పై కూడా ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ ఒక ప్రకటన చేసి ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా అభిమానులు కూడా వీరి కోసం నిరీక్షిస్తున్నారు. ఈ కాంభినేషన్ ఎప్పుడు సెట్ అవుతుందో..? అని వేచిచూస్తున్న అభిమాన గణానికి, ట్రీట్ ఇచ్చే విధంగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ 25వ సినిమా అన్న ప్రకటన వెలువడనుందా? అనే దానిపై సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.