Mahesh- Babuప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా “మహర్షి” సినిమాతో టాక్ ఆఫ్ టాలీవుడ్ గా మారిన వంశీ పైడిపల్లి, ఈ సినిమా పూర్తయిన తర్వాత మరో పెద్ద హీరోతో జత కట్టబోతున్నాడని తెలుస్తోంది. గతంలో ‘ఎవడు’ సినిమాతో రామ్ చరణ్ – అల్లు అర్జున్ లను డైరెక్ట్ చేసిన వంశీ పైడిపల్లి, ఈ సారి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమాకు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం.

‘ఎవడు’ భారీ విజయం సాధించకపోయినప్పటికీ, కమర్షియల్ గా భారీ నష్టాలను కూడా మిగల్చలేదు. బహుశా భారీ సక్సెస్ లోటు పూడ్చేందుకు మళ్ళీ జత కడుతున్నారో ఏమో గానీ, చెర్రీ – వంశీల కాంబో పట్టాలేక్కడం ఖాయం అన్న మాట బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో చేస్తోన్న చెర్రీ, ఈ సినిమా తర్వాత రాజమౌళితో కలిసి ఎన్టీఆర్ కాంబోలో మల్టీస్టారర్ చేయబోతున్నాడు.

మరోవైపు వంశీ కూడా తన ప్రస్తుత సినిమా కార్యక్రమాలను వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీ వరకు పెట్టుకోవడంతో, ఆ తర్వాత వీరిద్దరి కాంబో సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ వార్తలతో మరోసారి వంశీ పైడిపల్లి పేరు ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘మహర్షి’ ద్వారా అనుకున్న ఫలితాన్ని సాధిస్తే… టాప్ దర్శకుల జాబితాలో వంశీ పేరు నిలవడం ఖాయం అంటున్నారు ట్రేడ్ వర్గాలు.