మీడియా ఛానల్స్ ఇప్పుడు ఎలా వ్యవహరిస్తున్నాయో అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాను మాత్రం వీటన్నింటికి భిన్నం, తన లక్ష్యం ‘ప్రత్యేక హోదా’ దిశగా పోరాటం చేయడం మాత్రమే అంటూ… రాజకీయ నేతలపై ఒక స్థాయిలో విరుచుకుపడుతున్నాడు జర్నలిస్ట్ మూర్తి. ఒకప్పుడు ‘ఆంధ్రజ్యోతి’ ఛానల్ లో విధులు నిర్వహించిన ఈయన, ప్రస్తుతం ‘మహా న్యూస్’ ఛానల్ లో ‘స్పెషల్ స్టేటస్’ కోసం చర్చలు, వాదోపవాదాలు చేస్తూ రాజకీయ నాయకుల కంటే తాము ఉత్తమం అని చాటి చెప్తున్నారు.
గత కొన్ని రోజులుగా సదరు ఛానల్ లో ప్రసారమవుతున్న మూర్తి కధనాలపై బిజెపి నేతలకు పీకల దాకా మంట ఉన్న విషయాన్ని రాష్ట్ర బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి చెప్పకనే చెప్పారు. తాజాగా మూర్తితో డిబేట్ లో పాల్గొన్న సందర్భంగా… మోడీ పరిపాలనను, బిజెపి సమర్ధతను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయగా, వాటిని మూర్తి తిప్పికొట్టడం అన్న మాట పక్కన పెడితే, ఒక విధంగా మోడీ సర్కార్ ను ఉతికి ఆరేసాడని చెప్పవచ్చు. ఈ సమయంలో ఉడుక్కున్న విష్ణు, మీరు టిడిపిని ఎందుకు తిట్టరని ఎదురుదాడి చేసే ప్రయత్నం చేసారు.
అయితే అప్పటికే అన్ని పార్టీల ‘డబుల్ స్టాండర్డ్’ విధానంతో రెడీగా ఉన్న సదరు మీడియా ప్రతినిధి, టిడిపితో అన్ని పార్టీల తీరును ఏకరువు పెట్టారు. అయితే ఇందులో ప్రధాన భూమిక పోషించిన ఘనత కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అని హైలైట్ చేయగా, బిజెపి నేత వారించే ప్రయత్నం చేసారు. అయినప్పటికీ ‘ప్రత్యేక హోదా’ మాత్రమే తన సిద్ధాంతం అంటూ బిజెపిపై ఎదురుదాడి చేస్తూ, ప్రజల మెప్పును పొందారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా రాజకీయ నేతలను నిక్కచ్చిగా ప్రశ్నిస్తుండడం విశేషం.