Madhuri Dixit to replace Sridevi‘అతిలోకసుందరి’ శ్రీదేవి హఠాన్మరణంతో తనను మళ్లీ వెండితెరపై చూడాలనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఒకవేళ ఆమె బతికి ఉండుంటే… బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనున్న ‘షిద్ధత్’ చిత్రంలో అతిలోకసుందరి కూడా భాగస్వామి అయ్యేది. కానీ విధి ఆమెను తీసుకెళ్లిపోయింది.

ఈ సినిమా ఒకటి రెండు నెలల్లో సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. శ్రీదేవి మరణానంతరం కరణ్ ఈ ప్రాజెక్టును రద్దు చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ ఫిలిం సర్కిళ్లలో కొన్ని రోజుల కిందట పలు వార్తలు షికార్లు చేశాయి. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం, శ్రీదేవి పాత్రలో అలనాటి అందాల నటి మాధురీ దీక్షిత్ నటించనుందని తెలుస్తోంది.

ఈ ‘ఆజ్ నాచ్‌లే’ కధానాయిక కరణ్‌ జోహార్ కు మంచి ఫ్రెండ్ కూడా కావడంతో ఇందులో నటించేందుకు మాధురి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందనేది ఓ టాక్. శ్రీదేవి పాత్రలో నటించడమే ఆమెకు నివాళి తెలిపేందుకు సరైన మార్గమని మాధురీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో వరుణ్ థావన్, ఆలియా భట్, సోనాక్షి సిన్హ, సంజయ్ దత్, ఆదిత్యారాయ్ కపూర్ లాంటి స్టార్ నటులు నటించనున్నారు. ‘2 స్టేట్స్’ చిత్ర దర్శకుడు అభిషేక్ వర్మన్ ఈ చిత్రానికి డైరెక్టర్.