madhu priya reunites with husband srikanth,ప్రేమకధలలో ‘ట్విస్ట్’లు సహజమే… అనుకోని అవంతరాలే కధను రక్తికట్టిస్తాయి. ఇలాంటి ‘ట్విస్ట్’లకు సింగర్ మధుప్రియ కధలో కొదవలేదు. “ఇలాంటి నా కొడుకులు అసలు ఈ భూమ్మీద బ్రతకడానికి అవకాశమే లేదు, నా జీవితంలో ఇంకా శ్రీకాంత్ అనే వాడు లేడు, తనకు తల్లితండ్రులే శాశ్వతం” అంటూ చెప్పిన అదే మధుప్రియ ప్రస్తుతం… “శ్రీకాంత్ తప్ప నా జీవితంలో మరొకరికి స్థానం లేదు, మేము బ్రతికి ఉన్నంత కాలం కలిసే ఉంటాం, మా తల్లితండ్రులు చేసిన ఒత్తిడి మేరకే కేసులు పెట్టాల్సి వచ్చింది” అంటూ మొదటిసారి చేసిన వ్యాఖ్యలకు ఎక్కడా పొంతన లేకుండా తాజాగా ఓ మీడియా ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

“మధుప్రియను నమ్మించి, తనపై దాడి చేసారని, ఆమె తల్లితండ్రుల కారణంగానే ఇంత పెద్ద గొడవ జరిగిందని, తన జీవితమంతా మధుప్రియతోనే అంటూ” శ్రీకాంత్ తన మనసులోని భావాలను కూడా బయటపెట్టారు. దీంతో ఒక రకంగా వీరిద్దరి ప్రేమకధకు ‘శుభంకార్డు’ పడింది. ఈ సందర్భంగా గత మూడు రోజుల ఉదంతాలను చూసి తన కోసం ఆలోచించిన వారికి, ఆందోళన చెందిన వారికి క్షమాపణలు కోరింది మధుప్రియ. ఇక్కడితో మ్యాటర్ ఎండ్ అయ్యింది అనుకుంటే పొరపాటే. సెకండ్ పార్ట్ సీక్వెల్ కు ప్రారంభం ఇప్పుడే మొదలైనట్లు కనపడుతోంది.

మరి అంతలా మోసపూరితమైన వ్యాఖ్యలతో తనను ప్రలోభపరిచిన తల్లితండ్రులపై మధుప్రియ ఏం చేయబోతోంది. వారిపై ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల పర్యవసానాలు ఏంటి? ఈ విషయంలో శ్రీకాంత్ ఆలోచన ఏంటి? ఇంతకీ సొంత కూతురి కాపురంలో చిచ్చు పెట్టాల్సిన పని తల్లితండ్రులకు ఏం వచ్చింది? అంతకు ముందు శ్రీకాంత్ చెప్పినట్లు కేవలం ఆర్ధిక లావాదేవీలే కారణమా? అదే అయితే డబ్బుల కోసం ఇంత దిగజారుడుతనానికి తల్లితండ్రులు ఒడిగడతారా? ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సెకండ్ పార్ట్ లో సమాధానాలు లభించాల్సి ఉంది. ఈ ఎపిసోడ్లనంతా తిలకించిన వారు ఇన్ని ‘ట్విస్ట్’లను భరించడం మా వల్ల కాదు బాబోయ్… అంటున్నారు.