Madasu Gangadharamజనసేన నేతల మాటలు ఒక్కోసారి కోటలని దాటుతాయి. జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ ఛైర్మన్ మాదాసు గంగాధరం అటువంటి వ్యాఖ్యనే చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిప‌క్షనేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని ఒక్క మాట అన‌డానికి భ‌య‌ప‌డుతున్న త‌రుణంలో హైద‌రాబాద్ న‌డిబొడ్డున స‌భ పెట్టి కేసీఆర్‌ను నిల‌దీసిన ఒకే ఒక్క నాయ‌కుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ అంటూ కీర్తించారు. అయితే అంతకంటే తెలంగాణాలో పోటీ చేసి రాష్ట్రంలో ఎన్నో సభలు పెట్టిన చంద్రబాబు గురించి మర్చిపోయారు.

ఇంటర్ విద్యార్థుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం మెడలు వంచింది కూడా మేమే అంటున్నారు ఆయన. “ఇంట‌ర్ బోర్డు నిర్లక్ష్యం వ‌ల్ల 20 మందికి పైగా విద్యార్ధులు ఆత్మహ‌త్యలు చేసుకుని చ‌నిపోతే ఒక్క నాయ‌కుడు కూడా మాట్లాడలేదు. జ‌న‌సేన పార్టీ మాత్రమే విద్యార్ధుల త‌రఫున ఆందోళ‌న చేసి, వారి తల్లిదండ్రుల‌కు అండ‌గా నిల‌బ‌డింది. ప‌వ‌న్ విద్యార్ధుల‌కు న్యాయం చేయాల‌ని ప్రక‌ట‌న విడుద‌ల చేయ‌గానే.. తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా రీవాల్యూష‌న్ చేస్తున్నట్లు ప్రక‌టించింది” అని ఆయన చెప్పుకొచ్చారు,” అని అన్నారు.

ఆ విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ దానిపై నామమాత్రంగా స్పందిస్తూ ఒక ప్రెస్ నోట్ మాత్రమే విడుదల చేశారు. మీడియా ముందుకు రావడం కూడా చెయ్యలేదు. కొందరు జనసైనికులు మాత్రం మిగిలిన ప్రతిపక్ష పార్టీలతో కలిసి ఇంటర్ బోర్డు ఆఫీసు ముందు నిరసన తెలిపి అరెస్టు అయ్యారు. ఆ సందర్భంగానూ పార్టీ నుండి వారికి పెద్దగా సహకారం లభించలేదు అనే చెప్పుకోవాలి. దీనికి ఏకంగా జనసేన దెబ్బకు కేసీఆర్ ప్రభుత్వం భయపడిపోయింది అనడం ఏంటో?