నాగచైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా… లవ్ స్టోరీ. ఇప్పటికే చాలా సార్లు వాయిదాల పడిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలయ్యి మంచి రెస్పాన్స్ రాబట్టింది.
అయితే ట్రైలర్ లో ఒక డైలాగ్ ఇప్పుడు అభ్యంతరకరంగా మారింది. “రిక్షా వాడికి కొత్త రిక్షా ఇస్తే వాడు రిక్షానే తొక్కుతాడు….గొర్రెలున్నోడికి గొర్రెలిస్తే వాడు గొర్రెలే మేపుతుంటాడు. అలా చేస్తే ఇంకేం డెవలప్ అవుతాం సార్,” అని నాగచైతన్య అంటాడు.
అయితే ఈ డైలాగ్ పై సోషల్ మీడియాలోని తెరాస అభిమానులు కన్నెర్రజేస్తున్నారు. ఈ డైలాగ్ సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన గొర్రెల పంపిణీ పథకానికి కూడా కౌంటర్ లా అనిపిస్తోంది. కేసీఆర్ తీసుకువచ్చిన గొర్రెల పంపిణీ పథకం పై కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి.
కేసీఆర్ గొర్రెలను పంపిణీ చేస్తే పేదలు ఎలా డెవలప్ అవుతుంటారని వాళ్లు మళ్లీ గొర్రెలనే పెంచుకుంటూ అలాంటి జీవితాన్నేగడుపుతారని కొందరు విమర్శించారు. దీనితో నాగచైతన్య నుండి శేఖర్ కమ్ముల వరకూ అందరినీ ఉతికేస్తున్నారు తెరాస అభిమానులు. అయితే ఈ కాంట్రవర్సీ పూర్తిగా లాజిక్ లేనట్టుగా కనిపిస్తుంది.
నాగ చైతన్య, శేఖర్ కమ్ముల, సినీ నిర్మాతలు అంతా నాన్ కాంట్రోవర్సియల్ మనుషులే. కమ్ముల ఏవో సాఫ్ట్ సినిమాలు చేసుకుంటూ పోతారు. ఇటువంటి వాటిలోకి ఆయన ఎంటర్ అవుతాడు అనుకుంటే అది అనుకున్నవారి అమాయకత్వమే. ఆయన గత సినిమా ఫిదా హిట్ అయినప్పుడు కేసీఆర్, కేటీఆర్ స్పెషల్ షో వేయించుకుని చూసి మరీ పొగిడారు.
ఇక నాగార్జున ఫ్యామిలీ ప్రభుత్వాలను టచ్ చేసిన చరిత్ర లేదు. నిర్మాతలు తెలంగాణలో బిగ్ షాట్స్… పైగా ఆసియన్ సునీల్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు. ఏదో గొర్రెలు అని ఉన్ననంత మాత్రాన గొర్రెల్లాగా కళ్ళుమూసుకుని మీద పడిపోతే ఎలా అని నాగార్జున అభిమానులు ఆక్షేపిస్తున్నారు.