varun tej loaferఈ ఏడాది రెండు సినిమాలు విడుదల చేసిన అతి కొద్ది మంది హీరోలలో మెగా వారసుడు వరుణ్ తేజ్ ఒకరు. పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన “లోఫర్” గత శుక్రవారం విడుదలై ప్రేక్షకుల నుండి భిన్న స్పందనలను తెచ్చుకుంది. అయితే తొలి రోజు మంచి వసూళ్ళు రాబట్టడంతో ఈ వీకెండ్ లో చిత్ర బడ్జెట్ వస్తుందేమోనన్న అంచనాలు ట్రేడ్ పండితుల నుండి వ్యక్తమయ్యాయి. అయితే ఆశించిన స్థాయిలో “లోఫర్” కలెక్షన్స్ లేవని సినీ వర్గీయుల సమాచారం.

తొలి నాలుగు రోజులకు గానూ రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి కేవలం 7.55 కోట్లు మాత్రమే “లోఫర్” రాబట్టిందని టాక్. ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 15 కోట్లు పైనే జరగడంతో భారీ నష్టాలను ‘లోఫర్’ మిగల్చడం ఖాయంగా కనపడుతోందని సినీ విశ్లేషకులు లెక్కలు కడుతున్నారు. ‘ముకుంద, కంచె’ వంటి తొలి రెండు క్లాస్ చిత్రాలకు మంచి వసూళ్ళు రాబట్టిన మెగా హీరో, మొదటి సారిగా అటెంప్ట్ చేసిన ‘మాస్’ చిత్రంతో భారీ నష్టాలను మిగల్చడం కేవలం మెగా అభిమానులను సరిగా వినియోగించుకో లేకపోవడమేనని విశ్లేషకులు భావిస్తున్నారు.

లోకల్ గానే కాక, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ లలో కూడా ‘లోఫర్’ పరిస్థితి దయనీయంగా మారింది. ‘లోఫర్’లోని సెంటిమెంట్ సన్నివేశాలలో వరుణ్ అభినయం పట్ల విమర్శకుల నుండి ప్రశంసలు అందుకోవడం తప్ప, మూడో చిత్రం ద్వారా వరుణ్ సాధించింది ఏమీ లేదని ఖరారు చేసేసారు. ‘లోఫర్’ ఫలితంతో మరోసారి క్రిష్ కే వరుణ్ పచ్చజెండా ఊపారని, 2016 జనవరిలో “రాయబారి”గా సెట్స్ పైకి సిద్ధమవుతున్నాడని టాక్.