Lagadapati-Hints-Edge-to-Prajakutamiఈ సాయంత్రం 5 గంటలకు తెలంగాణాలో పోలింగ్ పూర్తి అయ్యింది. 72% కు తక్కువ కాకుండా పోలింగ్ నమోదు అయినట్టు సమాచారం. పోలింగ్ పూర్తవ్వగానే వరుసగా జాతీయ మీడియా ఛానళ్ళు తమ సర్వే రిపోర్టులు ప్రకటించడం మొదలు పెట్టాయి. ప్రతి సర్వేలోనూ తెరాసకు మెజారిటీ ఇచ్చి, మహాకూటమికి ఓటమి తప్పదు అని సంకేతాలు ఇచ్చాయి. ఈ క్రమంలో ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ మీడియా ముందుకు వచ్చి తెలంగాణ ఎన్నికలు రసకందాయంలో పడేశారు. ఆయన మహాకూటమికి స్పష్టమైన మెజారిటీ ప్రకటించారు.

మహాకూటమిలోని అన్ని పార్టీలను కలిపి 65 (+/-10 సీట్లు) రావొచ్చని చెప్పారు. ఇదే క్రమంలో అధికార తెరాస పార్టీకి 35 (+/-10 సీట్లు) మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చారు. అదే విధంగా బీజేపీకి 7 (+/-2 సీట్లు), ఎంఐఎంకి 6-7 సీట్లు, ఇండిపెండెంట్లకు 7 (+/-2 Seats), మరియు బీఎల్ఎఫ్ కు ఒక సీటు రావొచ్చని చెప్పుకొచ్చారు. మహాకూటమిలో టీడీపీకి 5-7 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్పారు ఆయన. దీనితో మహాకూటమి క్యాంపులో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి.

అదే సమయంలో తెరాస క్యాంపులో ఒక్క సారిగా అయోమయంకు గురయ్యారు. ఎన్నికలకు ముందు లగడపాటి చెప్పిన సర్వే కావాలని చంద్రబాబుకు అనుకూలంగా మార్చి చెప్పారని వారు అనుకుని సరిపెట్టుకున్నా, ఇప్పుడు ఎన్నికల తరువాత అబద్ధం చెప్పి ఆయన విశ్వసనీయత పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు కదా అని అలోచించి ఆందోళనకు గురవుతున్నారు. దీనితో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఒక్క సారిగా ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఈ నెల 11న ఫలితాలు అధికారికంగా విడుదల కాబోతున్నాయి.

ఈ సస్పెన్స్ అప్పటిదాకా కొనసాగుతుంది. మరో పక్క తెరాస గెలుపుపైనే ఎక్కువగా పందాలు జరగడంతో ఏం జరగబోతుందో అనే ఉత్కంఠ అందరిలోనూ ఉంది. ఈ ఎన్నికల ఫలితాలు జాతీయ స్థాయిలో ప్రభావం చూపించబోతున్నాయి. మహాకూటమి గెలిస్తే గనుక దేశవ్యాప్తంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి ఉండే అవసరం ఏర్పడుతుంది. అదే విధంగా జాతీయ రాజకీయాలలో చంద్రబాబు ఇమేజ్ అమాంతం పెరుగుతుంది. ఆరు నెలలో ఎన్నికలకు వెళ్లబోయే ఆంధ్రప్రదేశ్ లో కూడా టీడీపీ అనుకూల పవనాలు వీయడం ఖాయం.