ఆంధ్ర ఆక్టోపస్ గా పేరొంది నికార్సైన సర్వేలకు మారుపేరైన లగడపాటి రాజగోపాల్ ఈరోజు ఉదయం మీడియా ముందుకు వచ్చి ఈ ఎన్నికలలో ప్రస్తుత పరిస్థితులను బట్టి మహాకూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయి అని చెప్పారు. అసెంబ్లీ రద్దు సమయానికి తెరాసకు అనుకూలంగా ఉన్నా తరువాతి క్రమంలో టీడీపీ కాంగ్రెస్ పక్కన చేరడం కోదండరాం, సిపిఐ కలవడంతో గాలి కాంగ్రెస్ వైపు మళ్లిందని లగడపాటి చెప్పుకొచ్చారు. ఇదే క్రమంలో ఆయన చంద్రబాబును వదులుకోవద్దని కేటీఆర్కు తాను స్పష్టంగా చెప్పానని అన్నారు.
టీడీపీ బలం టీఆర్ఎస్కు కలిస్తే.. విజయం ఏకపక్షమవుతుందని అన్నానన్నారు. పొత్తులతో వెళ్లాలని తాను సూచించినప్పటికీ.. కేటీఆర్ మాత్రం ఒంటరిపోరుతోనే విజయం సాధిస్తానని తెలిపారన్నారు. ఎన్నికలకు ముందు టీడీపీ కి 6% ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఆ పార్టీ ఓటర్లు 2014 తరువాత జరిగిన పరిణామ క్రమం వల్ల తెరాస వైపు వెళ్లారు. ఎప్పుడైతే టీడీపీకి కాంగ్రెస్ రూపంలో అండ దొరికిందో చాలా వరకూ ఆ ఓటర్లు తిరిగివచ్చారు. ఈ ఎన్నికలలో అది చాలా ప్రభావం చూపింది అని చెప్పుకోలేదు ఆయన.
ఒక సమయంలో టీడీపీ తెరాస పొత్తు వార్తలు వచ్చాయి. అయితే బీజేపీతో ఉండే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా తెరాస నాయకత్వం వెనక్కు తగ్గింది. ఒకవేళ టీడీపీ పొత్తుతో లాభించి లగడపాటి చెప్పినట్టు మహాకూటమి అధికారంలోకి వస్తే ఆ నిర్ణయంపై కేసీఆర్ ఒక జీవితకాలం బాధ పడాల్సిందే. సంస్థాగతంగా ఎంతో బలమైన టీడీపీని అందరూ తక్కువ అంచనా వేసినట్టే. ఇన్ని అవరోధాలు ఎదురుకుని పార్టీ నిలబడింది అంటే అది సామాన్యమైన విషయం కాదు. దానికి సమాధానం కోసం 11 వరకు ఆగాల్సిందే.