Lagadapati Raj Gopal Nandhyal-Electionనంద్యాల ఉప ఎన్నికల ఫలితంపై మాజీ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తమకు చెప్పిన సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి మంచి మెజార్టీతో విజయం సాధిస్తుందని ఓ మీడియా ఛానల్ అధికారికంగా వేసిన వార్తను లగడపాటి రాజగోపాల్ తాజాగా ధృవీకరించారు. నంద్యాల ఉప ఎన్నికలపై తమ టీమ్ పరిశీలన జరిపిన మాట వాస్తవమేనని, ఈ ఉప ఎన్నికలో టీడీపీ విజయం ఖాయమని టీమ్ తెలిపిందని స్పష్టం చేసారు.

ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన లగడపాటి… ప్రీ పోలా? లేక ఎగ్జిట్ పోలా? అనేది పాయింట్ కాదని… ఇది తమ టీమ్ అభిప్రాయమని అన్నారు. నామినేషన్లు వేయక ముందు నుంచి తమ సభ్యులు నంద్యాలలోని పరిస్థితిని పరిశీలించారని, మధ్యలోనూ పరిశీలించారని, పోలింగ్ జరిగిన రోజునా పరిశీలించారని… ఇవన్నీ జరిగిన తర్వాత నంద్యాలలో గెలుపు ఎవరిదనే విషయాన్ని తనకు వెల్లడించారని చెప్పారు.

టీడీపీ గెలుపు అనేది తన వ్యక్తిగత అభిప్రాయం కాదని… అది తన టీమ్ అంచనా అని, రాష్ట్రంలో మూడేళ్ల తర్వాత జరిగిన ఎన్నిక కావడంతోనే… నంద్యాల ఉప ఎన్నికలకు ఇంతటి ప్రచారం వచ్చిందని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే భావనతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజలతోనే మమేకమై జీవించానని… కొన్ని ప్రత్యేక కారణాల రీత్యానే తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని లగడపాటి చెప్పారు.