ఇటీవలే కాలంలో వరుస జాతీయ మీడియా సర్వేలు తికమకపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైకాపా ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని వాటి సారాంశం. తికమక ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం ఏమి మారలేదు. ఉన్నఫళంగా వైకాపా ఎలా బలపడిందో ఎవరికీ అంతు చిక్కని ప్రశ్న.
దానితో ముఖ్యమంత్రి చంద్రబాబు సర్వేలకు పెట్టింది పేరైన లగడపాటి రాజగోపాల్ ను ఆంధ్రప్రదేశ్ తాజా పరిస్థితి గురించి అడిగారట. ఈ సర్వేలను పట్టించుకోవక్కర్లేదని ఆయన అన్నారట. ఆయన చెప్పిన ప్రకారం ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగితే 2014 కంటే గణనీయమైన స్థానాలు టీడీపీ గెలుచుకుంటుందని చెప్పారట.
దానికి కారణం 2014 కంటే రాయలసీమలో టీడీపీ బలపడటమే. అయితే ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో మాత్రం ఇప్పటికి బలహీనంగానే ఉందని చెప్పారు లగడపాటి. అదే విధంగా కాపు ఉద్యమం ఎలా ఉన్న గోదావరి జిల్లాలలో టీడీపీ తన పట్టును నిలబెట్టుకోనుందని చెప్పారట. ఇక పొత్తులు విషయానికి వస్తే బీజేపీతో కలిసి వెళ్లకపోతే ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందట.
మరోవైపు జనసేన విషయానికి వస్తే పొత్తు ఉంటే టీడీపీకి ఉపయోగపడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. జనసేన సొంతంగా గెలిచే అవకాశం పెద్దగా లేకపోయినా కొన్ని చోట్ల గణనీయమైన ఓట్లు రాబడుతుందని లగడపాటి అంచనా. బీజేపీతో కంటే జనసేనతో పొత్తు వల్లే ఎక్కువ లాభమని తేల్చి చెప్పారట.