kushboo-pawan-kalyan-trivikram-movieపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ చేయడంలో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ బిజీగా ఉన్నారు. మరో రెండు రోజుల్లో లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరగనుండగా, రెగ్యులర్ షూటింగ్ జనవరి నుండి ప్రారంభం కానుంది. అయితే ప్రస్తుతం చిత్ర తారాగణం మరియు సాంకేతిక నిపుణుల ఎంపికలో త్రివిక్రమ్ నిమగ్నమైనట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు ఫ్రెష్ లుక్ ను తీసుకువచ్చేందుకు కొన్ని కీలకమైన శాఖలలో మునుపటి కాంభినేషన్ ను రిపీట్ చేసేందుకు త్రివిక్రమ్ ఆసక్తి చూపడం లేదని సమాచారం.

అందులో భాగంగానే సంగీత దర్శకుడిగా అనిరుద్ ను ఎంపిక చేసారని, తాజాగా ఈ సినిమాలో కీలకపాత్ర కోసం ప్రముఖ నటి ఖుష్బూను సెలక్ట్ చేసారన్న ప్రచారం జరుగుతోంది. ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ కు అత్తగా నదియాను ఎంపిక చేసి, సినిమా ఫేట్ ను మార్చేసిన త్రివిక్రమ్, తాజా సినిమా కోసం ఖుష్బూను మళ్ళీ టాలీవుడ్ తెరపై చూపించబోతున్నట్లుగా ట్రేడ్ వర్గాల టాక్. తమిళ ప్రేక్షకులు దేవాలయాలు కట్టి మరీ పూజించిన ఖుష్బూ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.

విక్టరీ వెంకటేష్ ‘కలియుగ పాండవులు’ సినిమా ద్వారా పరిచయం అయిన ఖుష్బూ, తెలుగులో పెద్దగా నటించలేదు. రాజేంద్రప్రసాద్ తో ‘పేకాట పాపారావు’ వంటి సినిమాలలో నటించినా, అవి కాస్త బాక్సాఫీస్ వద్ద ప్రతికూల ఫలితాలు అందుకోవడంతో, మళ్ళీ ఖుష్బూ వైపుకు చూడలేదు. అయితే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ పవన్ సినిమా కోసం త్రివిక్రమ్ తీసుకురావడం అనేది, ఒక రకంగా రిస్క్ తో కూడుకున్న వ్యవహారంగా సినీ జనాలు చెప్పుకుంటున్నారు. బహుశా ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా తెరకెక్కుతుందేమో చూడాలి.