నేడు టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో పార్టీ జండా ఎగురవేసి కార్యకర్తలను నాయకులను ఉద్దేశించి ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమాన్ని 2001లో కేసీఆర్ ఒంటరిగా మొదలు పెట్టారని.. 71 ఏళ్ల చరిత్రలో రాష్ట్రంలో ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చాయని.. కానీ గట్టిగా నిలబడిన పార్టీ టీఆర్ఎస్ ఒక్కటేనని ఆయన చెప్పుకొచ్చారు. అదేవిధంగా తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది ఇద్దరు వ్యక్తులేనని.. ఒకరు ఎన్టీఆర్…మరొకరు కేసీఆర్ అని అన్నారు.
అయితే ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు పరిస్థితులు వేరని, కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ పరిస్థితులు వేరని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు రాజకీయ శూన్యత ఉందని, ఎన్టీఆర్ సినిమా స్టార్ కావడంతో…అప్పట్లో ఆయనకు ఎన్నో అనుకూలతలు ఉన్నాయన్నారు. కానీ కేసీఆర్కు ఎలాంటి అనుకూలతలు లేవని కేటీఆర్ అన్నారు. ఎన్టీఆర్ కంటే కేసీఆరే గొప్ప అని కేటీఆర్ అంటున్నారా? రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఉన్నందున పార్టీ ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు.
ఈ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాకపోవడం గమనార్హం. అలాగే మాజీ మంత్రి హరీష్ రావు కూడా గైర్హాజరయ్యారు. ఇది సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. అయితే హరీష్ మీడియాతో మాట్లాడి 2001 ఏప్రిల్ 27 చరిత్రలో లిఖించదగిన రోజుని చెబుతూ కేసీఆర్ నాయకత్వంపై పొగడ్తలతో ముంచెత్తడం విశేషం. మరోవైపు తెలంగాణలో 16 లోక్సభ స్థానాలను టీఆర్ఆర్ కైవసం చేసుకుంటుందని కేటీఆర్ దీమా వ్యక్తం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే గెలుపని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.