KTR on garbbageతెలంగాణ పురపాలక శాఖ మంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టిన సిఎం తనయుడు, టీఆర్ఎస్ యువనేత కల్వకుంట్ల తారక రామారావు ‘చెత్త’పై సమరం ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై జీహెచ్ఎంసీ అధికారులు స్పందిస్తున్న తీరును ఆన్ లైన్ లో పర్యవేక్షణకు శ్రీకారం చుట్టిన కేటీఆర్… మంగళవారం నాడు ‘చెత్త’పై ఓ యువకుడి ఇచ్చిన ఫిర్యాదుపై కేవలం గంటలో స్పందించి ‘ఔరా’ అనిపించారు.

నగరంలోని ట్రూప్ బజార్ కు చెందిన విశాల్ తులి అనే యువకుడు చెత్తపై మంత్రి కేటీఆర్ తో పాటు జీహెచ్ఎంసీ ట్విట్టర్ హ్యాండిల్ లో ఓ ఫిర్యాదును పోస్ట్ చేశారు. తమ ప్రాంతంలోని నవరంగ్ కాంప్లెక్స్, ఎలక్ట్రిక్ మార్కెట్ వద్ద పేరుకుపోయిన చెత్త ఫొటోలను అందులో పోస్ట్ చేశారు. దీనిని చూసిన కేటీఆర్ వేగంగా స్పందించి, వెంటనే అక్కడి చెత్తను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు.

కేటీఆర్ ఆదేశాలతో వెంటనే రంగంలోకి దిగిన పారిశుద్ధ్య కార్మికులు అక్కడి చెత్తను ఒక్క గంటలోనే ఎత్తేశారు. దీనిని గమనించిన విశాల్ తులి… చెత్తను ఎత్తివేసిన తర్వాత అక్కడి ఫొటోలను మరోమారు తీసి వాటిని తిరిగి కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి… వేగంగా స్పందించినందుకు మంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పారు.