తెలంగాణ రాజకీయాలలో ముఖ్యమంత్రి మార్పు గురించి తరచు మనం వింటూనే ఉంటాం. తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రతికూల పరిస్థితులు ఎదురైన తరుణంలో ఇక ఆ మార్పు ఉండకపోవచ్చని అంతా అనుకున్నారు. అయితే మళ్ళీ ఈ విషయం తెరమీదకు వచ్చింది. ముఖ్యమంత్రిగా కేటీఆర్ ప్రమాణస్వీకారం అతి త్వరలో ఉండబోతున్నట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
పట్టభద్రుల ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నిక, వరంగల్ తో పాటు ఖమ్మం మున్సిపల్ ఎన్నికల తరువాత రాష్ట్రంలో ఎన్నికల హడావిడి ఉండదు. ఈ తరుణంలో మిగతా మూడేళ్లకు కేటీఆర్ కు ముఖ్యమంత్రిని చెయ్యాలని కేసీఆర్ భావిస్తున్నారట. ప్రజలకు అందుబాటులో ఉండరని కేసీఆర్ మీద ప్రతిపక్షాలు తరచుగా ఆరోపణలు చేస్తూ ఉంటాయి.
అయితే కేటీఆర్ మాత్రం నిత్యం ప్రజల మధ్య ఉంటారు. ఆ ఆరోపణకు కూడా సమాధానం చెప్పినట్టు అవుతుంది ఈ మార్పు తో. అదే సమయంలో కేసీఆర్ పూర్తి స్థాయిలో రాజకీయ వ్యూహాలకు సమయం కేటాయించవచ్చు అని భావిస్తున్నారట. వచ్చే ఫిబ్రవరిలో యాదాద్రి లక్ష్మీనరసింహాస్వామి గుడి వద్ద ప్రత్యేక హోమం చేయబోతున్నారు.
ఆ పూజల అనంతరం కేటీఆర్ కు పదవి అప్పజెప్పే ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నిక, వరంగల్ తో పాటు ఖమ్మం మున్సిపల్ ఎన్నికలలో తెరాస మెరుగైన ఫలితాలు రాబడితే ఈ నాయకత్వ మార్పు ఇంకా సునాయాసంగా జరిగిపోతుంది అని ఆ దిశగా కేసీఆర్ దృష్టిపెట్టారట.