KTR - IT Miunnisterహైదరాబాద్ నగరంలో రహదారుల దీనావస్థను ప్రత్యక్షంగా తిలకించిన మంత్రి కేటీఆర్, అధికారుల వైఖరిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గత రెండు నెలలుగా భూగర్భ విద్యుత్ కేబుళ్ల నెపంతో రోడ్ల వెంట విచ్చలవిడిగా తవ్వకాలు జరుపగా, ఆపై కురిసిన వర్షాలకు కిలోమీటర్ల కొద్దీ రోడ్లు నరకాన్ని తలపించేలా పాడైపోయిన సంగతి తెలిసిందే. వివిధ మీడియా మాధ్యమాలలో రోడ్ల దుస్థితిపై కథనాలు రాగా, అమెరికా పర్యటనను ముగించుకు వచ్చిన కేటీఆర్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించి రోడ్లను పరిశీలించారు.

రోడ్డు వేసిన కాంట్రాక్టర్ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన కేటీఆర్, నాణ్యత లేని రహదారుల వల్లే ఈ పరిస్థితి నెలకొందని, విద్యుత్ విభాగం, జీహెచ్ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లోపం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోందని అసహనాన్ని వ్యక్తం చేశారు. మూడు నుంచి ఆరు అడుగుల లోతులో తవ్విన పొడవాటి గుంతలను చూసి, స్కూళ్లు తెరచిన వేళ, ఎవరైనా పిల్లలు అందులో పడిపోతే, ఎవరిది బాధ్యతంటూ అధికారులపై కేటీఆర్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్… మ‌హాన‌గ‌రంలో ప‌నుల్లో పార‌ద‌ర్శ‌క‌త తీసుకొస్తామ‌ని, ప‌నులు పూర్తి కావ‌డానికి విధించిన‌ కాల‌ప‌రిమితిని ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తామ‌ని, ఢిల్లీలో రోడ్ల అభివృద్ధి, ట్రాఫిక్ నియంత్ర‌ణ కోసం అనుస‌రిస్తోన్న ఉత్త‌మ విధానాన్ని స‌మీక్షిస్తామని అన్నారు. హైద‌రాబాద్‌లో రోడ్లను బాగుప‌ర్చేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామ‌ని, అధికారుల పనితీరు మరింత బాగుపడాలని అన్నారు. రోడ్ల దుస్థితిపై తాను ఈ రోజు చేసిన ప‌ర్య‌ట‌న ఆరంభం మాత్ర‌మేన‌ని, ఇతర మంత్రులు, అధికారులు రానున్న రోజుల్లో పర్యటిస్తారని చెప్పారు.