ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో వేలు పెడతాం, తెలంగాణ ఎన్నికలలో మమల్ని ఓడించడానికి ప్రయత్నించిన చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం అని ప్రకటించిన కేసీఆర్ బ్యాచ్ ఇప్పటికే ఆ దిశగా పని మొదలు పెట్టారు. హైదరాబాద్లో ఆస్తులున్న టీడీపీ నేతలను బెదిరించి వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్పిస్తున్నారని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. చంద్రబాబులా తాము ఖాళీగా లేమని.. తమకు పని ఉన్నదని అన్నారు.
హైదరాబాద్లో చంద్రబాబు నాయుడుకు కూడా ఆస్తులున్నాయని, చంద్రబాబు కలలో కూడా కేసీఆర్నే కలవరిస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబుది చేతకానితనమన్న కేటీఆర్.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని, ఆంధ్రప్రదేశ్ లో వైయస్సాఆర్ కాంగ్రెస్ గెలుస్తుందని తనకు అనిపిస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. ఢిల్లీలో చక్రం తిప్పడం కాదు…వచ్చే ఎన్నికల్లో విజయవాడలో కూడా చంద్రబాబు చక్రం తిప్పలేరని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో కేంద్రానికి కూడా వత్తాసుగా మాట్లాడారు కేటీఆర్.
దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఐటీ దాడులు జరుగుతాయని.. కానీ ఏపీలోనే జరుగుతున్నట్టు చంద్రబాబుకు ఉలికిపాటెందుకని ప్రశ్నించారు. “కేంద్రం అన్యాయం చేసిందని అంటున్నారు చంద్రబాబు.. తామే నంబర్ వన్ అని ఎలా చెప్పుకుంటారు?,” అని కేటీఆర్ ప్రశ్నించారు . గడిచిన ఐదేళ్లలో ఆంధ్రకు వ్యతిరేకంగా తామేం చేశామో బాబు చెప్పాలన్నారు. మరోవైపు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తరచూ ఆంధ్ర ప్రదేశ్ వెళ్లి అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసి వస్తున్నారు.