ఆంధ్రప్రదేశ్ కు ప్యాకేజ్ ను ప్రకటించిన కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని తెలంగాణా మంత్రి కేటీఆర్ ను ఢిల్లీలో కలిసారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేటీఆర్…, “ఆంధ్రప్రదేశ్ కు ఆర్ధిక సాయం చేస్తే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని, ఇది మంచి పరిణామమే అని, దీనిని స్వాగతిస్తున్నట్లుగా” చెప్పారు. అయితే ఇక్కడే మరో మెలిక కూడా పెట్టారు.
రెండు తెలుగు రాష్ట్రాలను సమంగా చూడాలని, లేదంటే తెలంగాణా పట్ల వివక్ష చూపుతున్నారనే అనుభూతి రాష్ట్ర ప్రజలకు కలగవచ్చని, తమ రాష్ట్రంలోనూ 9 వెనుకబడిన జిల్లాలు ఉన్నాయని, కరవు ప్రాంతాలు ఉన్నాయని, సాయం అందించాల్సిందిగా అరుణ్ జైట్లీని విజ్ఞప్తి చేసారు. హైదరాబాద్ – వరంగల్, హైదరాబాద్ – నాగపూర్ ఇండస్ట్రియల్ కారిడార్ ను కోరామని, అలాగే మిషన్ భగీరధ, మిషన్ కాకతీయలకు నిధులు విడుదల చేయాలని కోరినట్లుగా తెలిపారు.
గుజరాత్ తర్వాత దేశంలోనే మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రంగా రికార్డులకెక్కిన తెలంగాణాకు ఆర్ధిక సాయం అడగడం వింతేమి కాకపోయినా… ఏపీతో పోలుస్తూ అడగడమనేది ఖచ్చితంగా ఓ వింతే. లోటు బడ్జెట్ తో సతమతమవుతున్న ఏపీ మాదిరే తమది కూడా వెనుకబడిన రాష్ట్రం అంటూ కేటీఆర్ చెప్పడం… బహుశా కేంద్రం నుండి నిధులు రాబట్టుకోవడానికేనని చెప్పవచ్చు. అయితే, ఆపదలో ఉన్న ఏపీ వైపే అంతంత మాత్రంగా చూస్తున్న కేంద్రం, తెలంగాణా వైపు ఎంతమేరకు చూస్తుందనేది ప్రశ్నార్ధకమే?!